భారత వారసత్వ సంపద ‘కుంభమేళా’: యూనెస్కో గుర్తింపు
న్యూఢిల్లీ: దేశ ప్రజలు పరమ పవిత్రంగా భావించే కుంభమేళాకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో 'ఇంద్రియగ్రాహ్యంకాని వారసత్వ సంపద' జాబితాల్లో కుంభమేళాకు చోటు దక్కింది. ఈ మేరకు యునెస్కో గురువారం వెల్లడించింది.
మన దేశంలో ప్రతి 12ఏళ్లకోసారి ఈ కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, అలహాబాద్ ప్రయాగ, నాసిక్ త్రయంబకేశ్వర్, ఉజ్జయిని ఇలా నాలుగు కుంభమేళాలను నిర్వహిస్తుంటారు. కుంభమేళాలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
A very proud moment for us as sacred #KumbhMela is just inscribed as the Intangible Cultural Heritage of Humanity by @UNESCO
— Dr. Mahesh Sharma (@dr_maheshsharma) December 7, 2017
Kumbh Mela is considered to be the largest peaceful congregation of pilgrims on earth, attended by millions irrespective of caste, creed or gender. pic.twitter.com/8Lq6z4vKyf
2013లో అలహాబాద్ త్రివేణి సంగమ ప్రాంతంలో 55 రోజుల పాటు మహాకుంభమేళా జరిగింది. ఆ సందర్భంలో 10కోట్ల మంది ప్రజలు కుంభమేళాలో పాల్గొని పవిత్ర గంగానది, యమున, సరస్వతి సంగమప్రదేశంలో పుణ్యస్నానాలు చేశారు. కుంభమేళాకు యూనెస్కో వారసత్వ గుర్తింపు లభించడం పట్ల కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. యూనెస్కో గుర్తింపు లభించడం గర్వపడాల్సిన సందర్భమని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
కాగా, కుంభమేళాపాటు ఇటలీకి చెందిన నెపోలిటన్ పిజాయులో ఆర్ట్, కిర్గిస్థాన్కు చెందిన సంప్రదాయ గుర్రపుస్వారి, సెర్బియాకు చెందిన సంప్రదాయ జానపద నృత్యం కోలో తదితర కళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దేశ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆచారాలు, కళలు, నైపుణ్యాలు, ప్రతీకలు, చిహ్నాలకు యునెస్కో ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది.