ముఫ్తీకి అసంతృప్తి సెగ: రెండ్రోజులకే మంత్రి రిజైన్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ-పీడీపీల నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి రెండ్రోజులకే అసంతృప్తి సెగలు చెలరేగాయి. ఒకప్పటి వేర్పాటువాద నేత సజ్జద్ లోన్ తనకు కేటాయించిన పోర్ట్ ఫోలియోపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
సజ్జద్ రాజీనామా పత్రాన్ని బుధవారం బిజెపి హైకమాండ్కు పంపినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా, మీడియాకు దూరంగా ఉన్న సజ్జద్ తన ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా, మరో 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు.
సజ్జద్ తనకు వైద్య, ఆరోగ్య శాఖ దక్కుతుందని భావించినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే, ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో అసంతృప్తి చెందిన సజ్జద్ రాజీనామా చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసేందుకు కూడా నిరాకరించారు.
రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా పీడీపీకి చెందిన ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు.. సజ్జద్ను కోరారు. 2002లో హత్యకు గురైన పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ గిలానీ లోన్ చిన్న కుమారుడైన సజ్జద్ బీజేపీ కోటాలో కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.