నౌకా దళం చీఫ్ హెచ్చిరికలు నిజమౌతున్నాయా? : నావల్ స్టేషన్ గగనతలంపై డ్రోన్ చక్కర్లు
చెన్నై: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి చోటు చేసుకున్న వైమానిక దాడుల తరువాత కూడా ఉగ్రవాదం ముప్పు తొలగి పోలేదని, సముద్ర జలాల మీదుగా భారత్ పై దాడి జరిగే ప్రమాదం ఉందంటూ మనదేశ నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆయన మాటలు నిజమేననిపించేలా ఘటనలు చోటు చేసుకున్నాయి.
వ్యూహాత్మకంగా దక్షిణాదిన అత్యంత కీలకంగా భావించే చెన్నైలోని నౌకాదళ స్టేషన్ గగనతలంపై గుర్తు తెలియని డ్రోన్ ఒకటి చక్కర్లు కొట్టింది. సుమారు 10 నిమిషాల పాటు అది తిరుగాడింది. నౌకాదళ స్టేషన్ భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించారు. అప్రమత్తమయ్యే లోపే డ్రోన్ కనుమరుగైంది. ఈ డ్రోన్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు ఇంకా ఏవీ తెలియరాలేదు. ఏవైనా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన డ్రోన్ అయి వుంటే.. ఇప్పటికే వారు దీనిపై ఓ ప్రకటన చేసి ఉంటారు.
అలాంటి ప్రకటనలేవీ వెలువడకపోవడంతో నౌకాదళ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర జలాలపై నిఘా ముమ్మరం చేశారు. డ్రోన్ ఎలా వచ్చిందనే విషయంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనదేశ భద్రతను కట్టుదిట్టం చేశారు. త్రివిధ దళాలకు చెందిన బేస్ స్టేషన్లు, కీలక ప్రాంతాలపై నిఘా పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవట్లేదని నౌకాదళ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ సరిహద్దులను పంచుకుంటున్న గుజరాత్ తీర ప్రాంతమైన భుజ్ జిల్లా సహా, రాజస్థాన్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా డ్రోన్లు తిరుగాడిన విషయం తెలిసిందే. వాటిని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు.. డ్రోన్లను కూల్చి వేశాయి. అదే సమయంలో చెన్నై నౌకాదళ స్టేషన్ గగనతలంలో కూడా గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది.