కాల్పుల కలకలం: అర్ధరాత్రి స్కూటీపై వచ్చి.. యూనివర్శిటీ గేట్ వద్ద..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి తుపాకీ కాల్పుల కలకలం చెలరేగింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరవధికంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను కొనసాగిస్తోన్న ప్రఖ్యాత జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై మరోసారి కాల్పులకు తెగబడ్డారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన అతను మూడురౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనతో యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయిదు రోజుల్లో మూడో ఘటన..
అయిదు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న మూడో కాల్పుల ఘటన కావడం పట్ల ఢిల్లీ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆ ఆగంతకల కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఘటన అనంతరం జామియా మిల్లియా యూనివర్శిటీ విద్యార్థులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి భారీగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. జామియా నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
యూనివర్శిటీ గేట్ వద్ద..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిల్లియా యూనివర్శిటీ విద్యార్థులు ఆరంభం నుంచీ నిరవధికంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తమ ప్రదర్శనల్లో భాగంగా- ఆదివారం రాత్రి వందలాది మంది విద్యార్థులు యూనివర్శిటీ గేట్ నంబర్ 5 వద్ద గుమికూడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు ఆరంభించారు. రాత్రి వరకూ కొనసాగాయి ఈ నిరసన ప్రదర్శనలు. జామియా సమన్వయ కమిటీ (జేసీసీ) ఈ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది.
స్కూటీపై వచ్చి.. గాల్లోకి కాల్పులు జరిపి..
రాత్రి 11:45 నిమిషాల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై గేట్ నంబర్ 5 వద్దకు చేరుకున్నారు. వారిలో ఒకడు ఉన్నట్టుండి గాలిలోకి కాల్పులు జరిపాడు. విద్యార్థులపైనా తుపాకిని ఎక్కుపెట్టాడు. వారిని బెదిరించాడు. విద్యార్థులు పట్టుకోవడానికి ముందుకు వస్తుండటంతో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వైపు పారిపోయారు. ఈ ఘటన అనంతరం జామియా మిల్లియా విద్యార్థుల ప్రతినిధులు జామియా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు..
ఇద్దరు ఆగంతకులు ఎరుపురంగు స్కూటీపై వచ్చారని, వారు ఎర్రరంగు రెయిన్ జాకెట్లను ధరించారని వెల్లడించారు. స్కూటీ నంబర్ 1532 లేదా 1534 అయి ఉండొచ్చని ఫిర్యాదు లేఖలో పొందుపరిచారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన వెంటనే జామియా నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులు చోటు చేసుకున్న ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
రంగంలో దిగిన పోలీసులు..
ఐపీసీ సెక్షన్ 307/34, ఆయుధాల చట్టం సెక్షన్ 27 కింద ఆగంతకులపై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జగదీష్ యాదవ్ తెలిపారు. యూనివర్శిటీ గేట్ నంబర్ 5, గేట్ నంబర్ 7 వద్ద అమర్చిన అన్ని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. కాగా.. అయిదు రోజుల వ్యవధిలో పౌరసత్వ సవరణ చట్టం నిరసనకారులపై కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఇదే మూడోసారి.
కాల్పుల ఘటనతో..
ఇదివరకు రామ్భక్త్ గోపాల్ శర్మ అనే యువకుడు నేరుగా జామియా విద్యార్థులపైనే కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. మూడురోజుల తరువాత గుర్జర్ అనే మరో యువకుడు షహీన్ బాగ్ వద్ద నిరసనకారులను బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ రెండు ఘటనలపై ఢిల్లీ పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.