కేంద్ర బడ్జెట్ 2018: బిట్ కాయిన్పై నిషేధం?
న్యూఢిల్లీ: బిట్ కాయిన్ వాడకంపై కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. భారత్లో బిట్ కాయిన్ చట్టబద్దమైంది కాదని, నిపుణుల నివేదిక రాగానే ప్రభుత్వం పరిశీలించి దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ ఇటీవల అన్నారు.
ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్లో భారత్ వాట 11 శాతం ఉందని గుర్తు చేస్తూ దానిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ఇటీవల డిఎంకె సభ్యురాల కనిమొళి రాజ్యసభలో అడిగారు. దానికి వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.
బిట్కాయిన్లు దేశంలో చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాఖలాలు లేవు ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ తీవ్రంగా పతనమైంది. అయితే, బిట్ కాయిన్ల ట్రేడింగ్ ఇటీవల దేశంలో విపరీతంగా పెరిగింది. బిట్ కాయన్ల కొనుగోళ్లకు ప్రత్యేక డీలర్లు కూడా తయారయ్యారు.
అయితే, బిట్ కాయిన్ క్రయవిక్రయాలకు సంబంధించ కచ్చితమైన నిబంధనలేవీ లేవు. బిట్ కాయిన్లు కొనుగోలు చేస్తే చాలు, కొద్ది రోజుల్లోనే దండిగా సంపాదించవచ్చునని ట్రేడర్లు ఆశలు కల్పిస్తున్నారు.
గత ఏడాది కాలంలో బిట్ కాయిన్ల మార్గెట్ 2,000 రెట్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ కుప్ప కూలితే పెట్టుబడులు పెట్టినవారు తీవ్రంగ నష్టపోయే ప్రమాదం ఉంది.
అడ్డదారుల్లో చెల్లింపులకు బిట్ కాయిన్లను వాడుకోవడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. సేవారంగం వంటి వాటిల్లో వాటిని వినియోగిస్తే వాటి లెక్కలు తెలిసే అవకాశం లేదు. దీంతో ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.
బిట్ కాయిన్లలో పెట్టుబడి పెడితే ఎటువంటి పన్ను విధించాలనే విషయంపై కూడా స్పష్టత లేదు. క్యాపిటల్ గెయిన్స్గా పరిగణించాలో, ఆదాయ పన్ను విభాగంలోకి తీసుకుని లెక్కలు వేయాలా అనేది తెలియని పరిస్థితి.
ఈ స్థితిలో బిట్ కాయిన్లను నిషేధించడమో, పన్ను పరిధిలోకి తీసుకురావడమో జరుగుతుందని అంటున్నారు. ఈ బడ్జెట్లో అరుణ్ జైట్లీ ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.