కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ షాక్... స్టాక్ మార్కెట్లు ఢమాల్, తీవ్ర నిరాశలో మదుపరులు!
న్యూఢిల్లీ : 2018-19 కేంద్ర వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఇచ్చిన షాక్తో గురువారం మధ్యాహ్నం స్టాక్మార్కెట్లు ఢమాల్ అన్నాయి. లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్టీసీజీ(దీర్ఘకాలిక మూలధన పన్ను)ను విధించనున్నట్టు ప్రకటించడంతో స్టాక్మార్కెట్లు కుప్పకూలిపోయాయి.
సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు కిందకి పడిపోయింది. ప్రస్తుతం కొంత కోలుకుని 56 పాయింట్ల నష్టంలో 35,908 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా ఆ ప్రకటనతో 119 పాయింట్లు నష్టపోయింది.
మరోవైపు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు జైట్లీ పేర్కొన్నారు. ఎల్టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఒకవైపు పార్లమెంట్లో జైట్లీ ప్రసంగిస్తుండగానే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
భారీ పరిశ్రమలకు కూడా కార్పొరేట్ పన్నులపై ఎలాంటి మినహాయింపులు బడ్జెట్లో ఇవ్వకపోవడం కూడా పారిశ్రామిక వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది. గురువారం ప్రారంభంలో లాభాల్లోనే కొనసాగిన స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రసంగం మొదలైన కాసేపటికే కుదేలయ్యాయి.
మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో సెన్సెక్స్ 73 పాయింట్లు కోల్పోయి 35,892 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,005 వద్ద ట్రేడ్ అవగా ఆ తరువాత ఈ పతనం మరింత అధికమైంది.
తిరిగి రెండు గంటల ప్రాంతంలో మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 235 పాయింట్లు కోల్పోయి 36,200 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,062 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.