Union Budget 2020: బడ్జెట్ షాకింగ్.. జిడిపి వృద్ధి 10% ఉంటుందన్న నిర్మల.. ప్రతిపక్షాల హాహాకారాలు
Recommended Video
స్థూల దేశీయోత్పత్తి.. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్.. సింపుల్గా జీడీపీ.. ప్రస్తుతం దేశంలో ఎవరినోట విన్నా జీడీపీ అనే పదం వినబడుతోంది. ఒక ఏడాది కాలంలో దేశంలో అమ్ముడైన వస్తువులు, సేవల మొత్తం విలువనే జీడీపీ అంటారు. కాగా, గడిచిన 11 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ వృద్ధిరేటు దారుణంగా పడిపోవడం.. చివరి త్రైమాసికంలో 4.5గా నమోదుకావడం.. భారత్ తోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉండటం.. దీనిపై పెద్ద ఆందోళనలూ వ్యక్తమవుతుండటం తెలిసిందే. జీడీపీ వృద్ధిరేటుపై ఇంతలా చర్చ జరుగుతున్నవేళ.. కేంద్రం సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఆర్తిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ఏకంగా 10 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంచనాల కంటే.. మంత్రి వెల్లడించిన అంచనాలు దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం.
మంత్రి ఏం చెప్పారంటే..
2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘సబక్ కా సాథ్.. సబ్ కా వికాస్' నినాదంతో ముందుకు పోతోన్న మోదీ పాలనలో అన్ని రంగాలూ అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్న ఆమె.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) కూడా పాజిటివ్ దారిలోనే సాగుతున్నదని చెప్పారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి 10 శాతంగా ఉంటుందని అంచనవేసినట్లు ప్రకటించారు.
ద్రవ్యలోటుపైనా అదే తీరు..
ఆదాయం కంటే ఖర్చులు పెరగడాన్నే ద్రవ్యలోటు అంటారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశంలో ద్రవ్యలోటు దాదాపు 7 శాతానికి చేరడం అందరిలో ఆందోళన రేకెత్తించింది. ద్రవ్యలోటు 4 నుంచి 6 శాతంలోపే ఉండాలని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినా.. నంబర్లు పైపైకి వెళ్లడంతో సర్కారుపై విమర్శలు వచ్చాయి. అయితే శనివారం నాటి బడ్జెట్ లో మాత్రం మంత్రి నిర్మల.. ద్రవ్య లోటును 3.8 శాతంగా మాత్రమే అంచనావేశారు. ‘‘కేంద్రం పన్నుల సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో 2020 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంటుందని, అదే 2021లో ద్రవ్యలోటు 3.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం''అని నిర్మల ప్రకటించారు.
ఆర్థిక సర్వే అంచనాలనూ మించి..
బడ్జెట్ ప్రకటనకు ఒక రోజు ముందు వెల్లడైన ఆర్థిక సర్వేలో జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యలోటుకు సంబంధించి అంచనావేసిన అంకెల కంటే కేంద్ర మంత్రి బడ్జెట్ లో పేర్కొన్న అంకెలు పెద్దవిగా ఉండటం గమనార్హం. 2020-21లో జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతానికి పుంజుకోవచ్చని, ద్రవ్యలోటు 3.8 శాతానికి తగ్గొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కానీ మంత్రి మాత్రం జీడీపీ వృద్ధి ఏకంగా 10 శాతం ఉంటుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రతిపక్ష ఎంపీల లొల్లి..
దేశ జీడీపీ వృద్ధి రేటును 10 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించగానే ప్రతిపక్ష ఎంపీలు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఇవన్నీ అబద్ధాల లెక్కలని, నిన్నటిదాకా 4.5 శాతంగా ఉన్న జీడీపీ.. సడెన్ గా 10 శాతానికి ఎలా పెరుగుతుందని గట్టిగా అరుస్తూ మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని.. ప్రతి అంశంపై అభ్యంతరాలు తెలపడానికి ముందురోజుల్లో సమయం ఉంటుందని, బడ్జెట్ ప్రకటనకు అడ్డుతగలొద్దని హెచ్చరించడంతో ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గారు.