Union Budget 2020 : ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సెల్,సెల్ఫోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ప్రతిపాదన
దేశంలో పారిశ్రామిక అభివృద్ది కోసం పెట్టుబడి క్లియరెన్స్ సెల్ ఏర్పాటుకు నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. పెట్టుబడులకు సంబంధించిన సలహాలు,సూచనలు, ల్యాండ్ బ్యాంక్ సమాచారం మరియు రాష్ట్ర స్థాయిలో క్లియరెన్స్ను సులభతరం చేసేందుకు దీన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. దేశంలోని ప్రతీ జిల్లాను ఎగుమతుల హబ్గా మారుస్తామని తెలిపారు. అలాగే సెల్ఫోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు,సెమీ కండక్టర్స్,ఎలక్ట్రానిక్ పరికరాల యూనిట్లను ప్రతిపాదించారు.
అలాగే దేశవ్యాప్తంగా 6లక్షల మంది అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ ఫోన్స్ అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పౌష్టికాహారానికి సంబంధించిన వివరాలను వారు ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తారని చెప్పారు. పౌష్టికాహార సంబంధిత కార్యక్రమాల కోసం రూ.35,600 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
ఇక స్వచ్చ్ భారత్కు రూ.12300కోట్లు,ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు,గృహాలకు పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా కోసం రూ.3.6లక్షల కోట్లు, ప్రతీ జిల్లాను ఎగుమతుల హబ్గా మార్చేందుకు రూ.27300 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని లక్ష గ్రామ పంచాయితీలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్స్ ఇస్తామన్నారు. ఇక భారత్లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం IND-SAT టెస్టును ప్రతిపాదించారు.
ఉపాధ్యాయులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, సంరక్షకుల కోసం ప్రత్యేక బ్రిడ్జి కోర్సులను ప్రతిపాదించారు. నేషనల్ పోలీస్ యూనివర్శిటీ మరియు నేషనల్ ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయాలను కూడా ప్రతిపాదించారు. అలాగే దేశంలోని దేశంలోని టాప్ 100 ఇనిస్టిట్యూషన్స్లో పూర్తి స్థాయి ఆన్లైన్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఇక కొత్తగా మరో 11వేల కి.మీ రైల్వే ట్రాక్స్,2వేల కి.మీ పొడవైన జాతీయ రహదారులను నిర్మించనున్నట్టు చెప్పారు.