కేంద్ర బడ్జెట్ను రాష్ట్రాల కోణంలో చూడొద్దు: ఏపీకి న్యాయం చేస్తామన్న బీజేపీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అదనపు నిధులు దక్కకపోవడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని బీజేపీ ఖండించింది. ఏపీకి ఎక్కడా అన్యాయం జరగలేదని, జరగబోదని భరోసా ఇచ్చింది. లదాక్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించడాన్ని నేతలు సమర్థించుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు చేశారు.
దేశ ఆర్థికాభివృద్దే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటుందని, విశాలమైన విజన్ తో కూడిన కేంద్ర బడ్జెట్ ను రాష్ట్రాల కోణంలో.. స్థానిక అంశాల ప్రాతిపదికన అసలే చూడొద్దని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగినమాట అవాస్తవమని, రెగ్యులర్ నిధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోమని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రం విస్మరించిందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితమని, పోలవరానికి బడ్జెట్ ద్వారా కాకుండా, నాబార్డు ద్వారా నిధులిస్తున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు ఎంపీ నర్సింహారావు తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి, కొత్తగా ఏర్పడ్డ కేంద్రపాలిత ప్రాంతం లడాక్ కు స్టేటస్ కల్పించడంపై వస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా బదులిచ్చారు. ఏపీని, కాశ్మీర్ తో పోల్చొద్దని, అవి రెండూ వేర్వేరు అంశాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లాగే ఏపీకి కూడా న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.