Railway budget 2021 :ప్రైవేట్ రైళ్లపై కేంద్రం ఫోకస్.. అందు కోసమేనా..!
న్యూఢిల్లీ: మరికొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరి 1న కేంద్రం 2021కి సంబంధించి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది. అయితే ఈ సారి రైల్వే బడ్జెట్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి..? భారత రెవిన్యూలో కీలక పాత్ర పోషించే రైల్వేకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత దక్కనుంది..?
బడ్జెట్ అనగానే ముందుగా అందరికి గుర్తువచ్చేది రైల్వే బడ్జెట్. భారత రెవిన్యూలో కీలకపాత్ర పోషించే రైల్వేలకు బడ్జెట్లో ఎప్పుడూ సింహ భాగం ఉంటుంది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి రైల్వే బడ్జెట్లో గతేడాదితో పోలిస్తే 3 నుంచి 5శాతం వరకు పెంపు ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1.80 లక్షల కోట్లను రైల్వేస్కు బడ్జెట్లో కేటాయింపులు జరపలాని రైల్వేశాఖ ఆర్థికశాఖను కోరినట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ ప్రభావంతో చాలా నష్టాలు వచ్చాయని రైల్వే శాఖ నుంచి వచ్చిన ఈ డిమాండ్ ఆచరణలో పెట్టడం అసాధ్యమని ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక రానున్న ఆర్థిక సంవత్సరం (2021-22)కి కేంద్రం రూ.1.77 లక్షల కోట్లు రైల్వేలకు కేటాయించనున్నట్లు సమాచారం. అంతేకాదు స్థూల బడ్జెట్ అంచనా రూ.75వేల కోట్లు ఉండొచ్చని సమాచారం. ఇక నష్టాలను పూడ్చుకునేందుకు కేంద్రం ప్రధానంగా ప్రైవేట్ రైళ్లు నడపడంతో పాటు కొత్త రైళ్ల పై దృష్టి సారించనున్నట్లు సమాచారం. పర్యాటక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీపై కూడా ఫోకస్ చేయనుంది. ఇక కిసాన్ రైలు రూట్లను విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై కేంద్రం దృష్టి పెడుతోంది.
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఏప్రిల్ 8వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఫిబ్రవరి 15న వాయిదా పడి తిరిగి సమావేశాలు మార్చి 8న ప్రారంభం అవుతాయి. కరోనావైరస్ కారణంగా ఉభయ సభలు ఒక్కో షిఫ్టులో సమావేశాలను నిర్వహిస్తాయి. ముందుగా రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ సమావేశాలు జరుగుతాయి.