union budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపు
వైద్యారోగ్యం, మౌలిక రంగం, సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, ఇన్నోవేషన్ అండ్ ఆర్ ఎండ్ డీ.. అనే ఆరు ప్రాధామ్యాలపై ఈసారి వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సోమవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన ఆమె.. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పద్దులు తయారు చేశారు. ఆ క్రమంలో సామాణ్యుడిని వీలైనంతలో పిండేయడానికి కూడా ఆమె వెనుకాడలేదు..
Recommended Video
తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..
కరోనా పన్నుకు పేరు మారిందా?
కరోనా విలయ కాలంలో అన్ని రకాలుగా దెబ్బతిన్న సామాన్యుడు ఎగిరి గంతేసే ఏ ఒక్క అంశమూ లేకపోగా.. ఐటీ శ్లాబులను మార్చలేదంటూనే.. అత్యంత చమత్కారంగా కొత్త రకం పన్నులు మోపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. పన్నుల ద్వారా ఆదాయం పిండుకోవడం సామాన్యుడిపై ప్రత్యక్ష భారమైతే.. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరింత ఆదాయం పొందడాన్నే అభివృద్ధిగా కేంద్రం అభివర్ణించడం దీర్ఘకాలంలో ఇదే సామాన్యుడిపై పెనుభారం చూపనుంది. దేశప్రజలందరిపైనా 'కరోనా పన్ను' విధిస్తారని ప్రచారం జరిగినా, మరో పేరుతో.. పాత విధానాలను మార్చకుండానే తెలివిగా ఆ పనిని పూర్తిచేశారామె. పాత ఆర్థిక లక్ష్యాలనే కొత్తగా చెబుతూ సాగిన నిర్మలమ్మ పద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
అన్నిటిపై అగ్రిఫ్రా సెస్
కరోనా పన్నుకు ప్రత్యామ్నాయంగా కొత్తగా 'అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్టక్చర్ అండ్ డెవెలప్మెంట్ సెస్ (అగ్రిఫ్రా సెస్)'పేరుతో భారీ ఎత్తున పన్నుల వసూళ్లకు కేంద్రం సిద్దమైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, భారత్ లో మాత్రం పన్నుల వసూళ్లు తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతూ వస్తుండటం తెలిసిందే. వాటిని మరింత ప్రియంగా మార్చుతూ మంగళవారం(ఫిబ్రవరి 2) నుంచే పెట్రోల్, డీజిల్ పై అగ్రిఫ్రా సెస్ వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకుండా, డిజిటల్ రూపంలో విడుదలైన పద్దుల్లో మాత్రం ప్రధానంగా పేర్కొన్నారు. బడ్జెట్ కాపీలు బయటికి వస్తున్నకొద్దీ ఈ అగ్రిఫ్రా సెస్ దాదాపు అన్ని రంగాలపై విధించినట్లు స్పష్టమవుతోంది. మద్యంపై ఏకంగా 100 శాతం అగ్రిఫ్రా సెస్ విధించారు. బంగారం, వెండి ధరలు తగ్గించినట్లే చేసి, వాటిపైనా అగ్రిఫ్రా సెస్ విధించారు. బొగ్గు, ఎరువులు, కాబూలి శెనగలు, బఠానీలు, పత్తి యాపిల్.. ఇలా కొత్తగా అగ్రిఫ్రా సెస్ విధించిన వస్తువుల జాబితా చాలా పెద్దదే. తద్వారా సామాన్యుడిని నొప్పి కొలగకుండా పిండేసుకునే ప్రయత్నం చేశారని నిపుణులు అంటున్నారు. నిజానికి.. జనవరి నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ టాక్స్ వసూళ్లు రూ. లక్షా ఇరవై వేల కోట్లు దాటాయి. గతంలో ఎప్పుడూ ఒక్క నెలలో ఇంత రాలేదు.ఈ పన్నునే అభివృద్ధిగా కేంద్ర ఆర్థిక మంత్రి భావించినట్లుగా ఉన్నారు. అందుకే మరింత రెట్టించిన ఉత్సాహంతో పన్నుల వసూలుకు సిద్ధమయ్యారు.
ఆత్మ నిర్భర్ అంతరార్థమూ అదే..
కరోనా విలయ కాలంలో కేంద్రం ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే పెట్రోల్, డీజీల్ ధరలు గరిష్టంగా 15 రూపాయల దాకా పెరిగింది. ఈ పెంపును బడ్జెట్ లో కవర్ చేస్తూ సామాన్యుడికి ఊరట కలిగిస్తారని, చమురుపై ఎక్సైజ్ ట్యాక్స్ను తగ్గిస్తారని అధికార పార్టీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసుకున్నా.. ఆ ఊరట కూడా లభించలేదు. దీన్ని బట్టి చూస్తే.. మంగళవారం నుంచి సామాన్యుడి చమురు మరింతగా వదలడం ఖాయమైపోయింది. నిజానికి ఆత్మనిర్భర్ అభియాన్ ప్రకటనకు.. నిజంగా దాన్ని అమలు చేస్తున్న తీరుకు ఎక్కడా పొంతన లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రజల నుంచి పన్నులు పిండుకోవడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని అందరికీ తెలిసినా.. దానికో చక్కటి పేరు పెట్టడం ద్వారా నొప్పి కలగకుండా చేయడం మోదీ-నిర్మల మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. కొత్త పన్నుకు కరోనా సెస్ అని కాకుండా వ్యవసాయ అభివృద్ధి కోసం పన్ను అని అభివర్ణిచండం దీనికో ఉదాహరణ. అదే సమయంలో..
ఇన్కంట్యాక్స్లోనూ అదే మ్యాజిక్..
కేంద్ర బడ్జెట్ అంటే.. ముందుగా వేతన జీవులు ఎదురు చూసేది ఇన్కంట్యాక్స్ శ్లాబుల్లో వెసులుబాటు. కానీ ఈ సారి శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కరోనా అనంతర కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి, మధ్యతరగతి ప్రజల ఖర్చులు అమాంతం పెరిగిపోయి, వారి రోజువారీ ఖర్చుల్లో ప్రతీదానిపైనా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ.. ఆదాయపు పన్ను పరిమితి పెంచకుండా.. 'శ్లాబుల్లో మార్పులు లేవు' అని ఢంకా బజాయించుకోవడం గమనార్హం. స్టాండర్డ్ డిడక్షన్ ఎంతో కొంత పెంచుతారని ఆశించినా చివరికి హ్యాండిచ్చారు. పైగా కొత్తగా విధించిన అగ్రిఫ్రా సెస్ రేపటి నుంచే అమలుకానుంది. దీని అర్థం.. మధ్య తరగతి జీవులు.. పెరిగిన రేట్లకు తోడు.. పన్నులు... దానికి తోడు ఇన్కంట్యాక్స్ కూడా వదిలించుకోవాల్సిందేనని. కాగా, కఠినమైన కండిషన్ల నడుమ.. 75 ఏళ్లు దాటిన వారు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని, ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా నిర్మల ఊరట వాక్యాలు చదివారు.
విదేశీకి తలుపులు బార్లా..
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ కరోనా విలయ కాలంలో.. పక్కా పెట్టుబడిదారి దేశాలతో సమానంగా భారత ఎకానమీ కుదేలైన సంగతి తెలిసిందే. కొవిడ్ దెబ్బ నుంచి కోలుకునే దిశగా కేంద్రం 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'ను ప్రకటించగా, ఆ ప్రకటనకు విజన్ గా ఇవాళ్టి బడ్జెట్ ఉంది. ఆత్మ నిర్భర్ అంటే ఇండియా తనకు తానే తలుపులు మూసుకోవడం కాదని, గతంలో కంటే విదేశీ పెట్టుపడుల రాకకు రెడ్ కార్పెట్ పర్చినట్లేనని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఉద్ఘాటించారు. దానికి అనుగుణంగానే ఇవాళ నిర్మలమ్మ తన పొద్దులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్మి.. సొమ్ము చేసుకునే దిశగా నిర్మలమ్మ చాలా పట్టుదల కనబర్చారు. అత్యంత లాభదాయకమైన ఎల్ఐసీని కూడా ఈ ఏడాదే ఎఫ్డీఐ లిస్టింగ్ కు తీసుకురాబోతున్నారు. అలాగే ఇతర నవరత్న కంపెనీల్లోనూ.. పెట్టుబడుల ఉపసంహరణకు భారీ ప్రణాళిక ప్రకటించారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు రూ.12 లక్షల కోట్ల అప్పులు కూడా తేవాలని నిర్ణయించుకున్నట్లుగా సీతారామన్ ప్రకటించారు. ఈ విధానాలు దీర్ఘకాలంలో సామాన్యుడికి పెనుభారం కాకతప్పదని గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి.
బడ్జెట్ పాలిటిక్స్..
విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నానన్న నిర్మలమ్మ వ్యాఖ్యలు ప్రజలకు మాత్రమే యాప్ట్ అవుతాయి. అంటే, విపత్కరం ప్రభుత్వానికి కాదు ప్రజలకే. సాధారణ కేటాయింపులు చూసినప్పుడు కొంత సబరం అనిపించవచ్చుగానీ.. గతేడాది కేటాయింపుల్లో ఎంత ఖర్చు చేశారు? దాని వల్ల సాధించిన వృద్ధి ఏంటి? అనే వాస్తవాలను అలవోకగా దాటేయడం అన్ని ప్రభుత్వాలకు అలవాటైనపనే. అదీగాక బడ్జెట్ పాలిటిక్స్ లో బీజేపీది అందెవేసిన చేయి. అందుకే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలు భారీగా తాయిలాలు ప్రకటించారు. అఫ్కోర్స్ వాస్తవంగా వాటిని ఎప్పుడు విడుదల చేస్తారన్నది.. గతంలో ప్రకటించిన బీహార్ ప్యాకేజీని గుర్తుచేసుకుంటే ఇట్టే అర్థమైపోతుంది.
బ్రెక్ ఫెయిలైతే హారన్ సౌండ్ పెంచారు..
కరోనా విలయం, సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల దేశప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నది పచ్చి వాస్తవం. అన్ లాక్ తర్వాత కూడా కోట్లాది మంది తిరిగి ఉపాధి పొందలేకపోవడం, ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు పూర్తి స్థాయిలో జీతాలు అందకపోవడం, ప్రైవేటు విద్యారంగంలోనివారైతే ఈ రోజుకూ అగాథంలో ఉండటం క్షేత్రస్థాయి వాస్తవం. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయం కుదేలై కార్పోరేట్లకు లబ్ది చేకూరుతోందన్న ఆరోపణలకు సరైన సమాధానాలు ఇవ్వకుండానే.. కొత్తగా వ్యవసాయ అభివృద్ధి పేరుతో కేంద్రం పన్నుల వడ్డకు సిద్ధమైంది. బడ్జెట్ 2021పై లెక్కకు మించి విశ్లేషణలు వెలువడగా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన సింగిల్ లైన్ రివ్యూ వైరల్ అయింది. బతుకు బండి చెడిపోయిన ప్రజలు.. బీజేపీ అనే మెకానిక్ దగ్గరికి వెళితే.. ''బ్రేకులు ఫెయిలైన బండిని నేను బాగు చేయలేను. కానీ, హారన్ సౌండును మాత్రం పెంచేశాను'' అని చెప్పినట్లుగా ఈ ఏడాది బడ్జెట్ ఉందని థరూర్ ఎద్దేవా చేశారు.
నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ