Union Budget 2021: సామాన్యుడి బడ్జెట్గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మరి కొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోందని చెప్పగానే ముందుగా సామాన్యుడి బడ్జెట్గా ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఈ సారి బడ్జెట్ మాత్రం సవాళ్లతో కూడుకున్నదే అవుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒకానొక సమయంలో గాడి తప్పింది. దీంతో 2021 బడ్జెట్ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
గతేడాది కరోనా కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. కొన్ని వారాల సమయంలోనే 40శాతంకు పైగా మార్కెట్లు పడిపోయి దేశ ఆర్థిక పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చాయి. అనంతరం తిరిగి 87శాతంతో అనూహ్య రీతిలో కోలుకున్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని విశ్లేషకులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం కొనసాగేలా కేంద్రం కొన్ని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది.పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకుంది. ఈ క్రమంలోనే ఈ సారి బడ్జెట్లో సింహ భాగం దేశ ఆర్థిక వ్యవస్థపైనే ఫోకస్ చేసి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.ఇక కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా తిరిగి గాడిలో పడాలంటే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు కాస్త సహకరించాల్సిన పరిస్థితి ఉంది. ఈక్రమంలోనే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు సంపాదిస్తూ 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి ఆదాయపు పన్ను రేటును 20శాతం నుంచి 10శాతంకు తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో కీలకంగా మారే సెక్షన్ 80సీని మెరుగుపరిస్తే లాభం ఉంటుంది. చివరిసారిగా సెక్షన్ 80సీని 2014లో సవరించారు.ప్రస్తుతం పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, బీమా ప్రీమియం, హోంలోన్, పిల్లల టూష్యన్ ఫీజు పేర్లతో రూ.1.50 లక్షలను పొదుపు చేస్తున్నారు పన్ను చెల్లింపుదారులు. అయితే గృహ రుణాలు, పిల్లల ట్యూషన్ ఫీజులను ఇందులోనుంచి తొలగించడమో లేదా ఒక సీలింగ్ విధించడమో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
2018 బడ్జెట్లో మెడికల్ బిల్స్ రీఇంబర్స్మెంట్ విత్డ్రాల్పై పరిమితి విధించింది కేంద్రం. ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైపోయింది. అయితే మెడికల్ రీఇంబర్స్మెంట్ విత్డ్రాల్ తిరిగి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఖర్చులు భరించలేని వారికి ఒకసారి మినహాయింపును ఇవ్వడంపై ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇక కరోనా కారణంగా ఆరోగ్య బీమాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో అధిక ప్రీమియంకు కొంత వరకు మినహాయింపు ఇస్తే బాగుంటుంది. దీనివల్ల ఎక్కువమంది బీమా తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం 60ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు సెక్షన్ 80 డీ కింద తమ భాగస్వామికి, పిల్లలకోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25వేల వరకు తగ్గింపు పొందుతున్నారు.
ఇక చివరిగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పై కూడా ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఏడాది కంటే ఎక్కువగా హోల్డ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కు 10శాతం పన్ను విధించడం జరుగుతోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ పన్నును ఉపసంహరించుకోవాలంటూ చాలామంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక క్రమంగా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటం, కరోనాకు వ్యాక్సిన్లు రావడం భవిష్యత్తులో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2021 బడ్జెట్ కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నారు. అంతేకాదు 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా మారుతుందనే ఆశ ఇంకా బతికే ఉండాలంటే ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.