Budget 2023: మొత్తం బడ్జెట్లో 13 శాతం వాటా ఈ రంగానిదే..!!
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీ ఎత్తున కేటాయింపులు జరిగాయి. మొత్తం బడ్జెట్ లో 13 శాతానికి పైగా వాటా ఈ రంగానికి కేటాయించింది.
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరట కల్పించడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె పార్లమెంట్ లో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా కొనసాగించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బీజేపీ నాయకులు స్వాగతిస్తోండగా.. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తోన్నాయి. వేతన జీవులకు ఊరట కల్పించడాన్ని కొందరు కాంగ్రెస్ ఎంపీలు స్వాగతించడం కొసమెరుపు.
వేతన జీవులకు ఊరట కల్పించారు నిర్మల సీతారామన్. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వారిని పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపునిచ్చారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిపై 5, 6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను విధించారు. రూ.15 లక్షల వార్షికాదాయం దాటిన వారిపై 30 శాతం పన్ను విధించారు.
అదే సమయంలో- దేశ రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు నిర్మల సీతారామన్. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 5.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. గతంతో పోల్చుకుంటే డిఫెన్స్ సెక్టార్ కు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల మొత్తం 13.31 శాతం అధికం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం బడ్జెట్ లో 13 శాతం వాటా రక్షణ రంగానిదే. రక్షణ రంగాన్ని ఆధునికీకరించడంలో భాగంగా ఈ మేరకు భారీ కేటాయింపులు చేయాల్సి వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం కొనసాగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకంచి చైనా వైపు నుంచి తరచూ అవాంఛిత పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంపైకి దూసుకొస్తూ ఉద్రిక్తతలకు కారణమౌతోంది. సరిహద్దులకు అత్యంత సమీపంలో గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది. వాటిని సైనికుల ఆవాస ప్రాంతాలుగా మార్చుతోంది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవడానికి వీలుగా ఈ కేటాయింపులు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రాఫెల్ యుద్ధ విమానాలను మరిన్ని కొనుగోలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి కొనుగోలు చేయాల్సిన ఏకే 203 రైఫిళ్లకూ ఇందులో మెజారిటీ వాటా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 7.. రాజధాని అమరావతికి బిగ్ డే..!!