నిర్మల సీతారామన్ను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ..!!
కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇవ్వాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇవ్వాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023 పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను ఇది మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలవారి ముఖంలో చిరునవ్వు కనిపించేలా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించారని వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు కంటోన్న కలలను సాకారం చేసేలా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు.
నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందించారు. దీన్ని చారిత్రాత్మక బడ్జెట్ గా అభవర్ణించారు. వ్యవసాయం మొదలుకుని శాస్త్ర సాంకేతికత వరకు అన్ని రంగాలకూ ఆమె ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్, ఆమె సహాయమంత్రులు, ఆర్థికశాఖ అధికారులందరినీ తాను అభినందిస్తోన్నానని చెప్పారు. ప్రత్యేకించి మౌలిక రంగానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు.
పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజనను ప్రవేశపెట్టడం, వారి ప్రయోజనాల గురించి ఆలోచించడం గొప్ప విషయమని మోదీ చెప్పారు. కోట్లాదిమంది విశ్వకర్మల జీవితాలను ఈ పథకం మలుపు తిప్పుతుందని పేర్కొన్నారు. హస్త కళాకారులు, చేతివృత్తులవారికి శిక్షణ ఇవ్వడం, వారికి ఆర్థిక స్వావలంబనను కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు.
పట్టణాలు, గ్రామాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి కొత్తగా చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని తీసుకుని వచ్చామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మధ్య తరగతి కుటుంబాల వారికి మరింత ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలా కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ జాబ్స్ కు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని, సాంకేతికత-ఆర్థిక రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటోన్న 3.5 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ ఏడాదే 38,800 ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టనున్నామని, పీఎంపీబీజీటీ డెవలప్ మెంట్ మిషన్ కింద గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించామని, దీనికోసం బడ్జెట్ లో నిధులను కేటాయించామని చెప్పారు.