Union Budget 2023: రైల్వే ప్రయాణికులు కోరుకుంటోన్నది ఇదే..!!
కేంద్ర బడ్జెట్ 2023కి కౌంట్ డౌన్ ఆరంభమైంది. మరో 48 గంటల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష యూపీఏకు ఇది అత్యంత కీలకమైన సంవత్సరం. ఈ ఏడాదే తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు- ఇవి సెమీ ఫైనల్ గా భావిస్తోన్నాయి రాజకీయ పార్టీలన్నీ. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఎన్డీఏ, యూపీఏ సన్నద్ధమౌతోన్నాయి.
మూడింటి షెడ్యూల్..
కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయా, మిజోరాంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాల్లో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది కూడా. ఫిబ్రవరి 16వ తేదీన త్రిపుర, 27వ తేదీన నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
బడ్జెట్ పైనే..
ఈ పరిణామాల మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. దీనికి ముహూర్తం ఖరారైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్- ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సంవత్సరం సార్వత్రిక పోరు ఉన్న నేపథ్యంలో- ప్రస్తుతం అందరి దృష్టీ.. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలపైనే నిలిచింది. ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారనేది ఉత్కంఠత రేపుతోంది.
గంపెడాశలు పెట్టుకున్న రైల్వే ప్రయాణికులు
ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైల్వే ప్రయాణికులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వేలు రైలు ఛార్జీలు పెరగకూడదని కోరుకుంటోన్నారు. ఛార్జీల పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, రద్దయిన రాయితీలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోన్నారు. పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబీకులు దూర ప్రయాణాలు సాగించడానికి వీలుగా రైల్వే ఛార్జీలు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
వందే భారత్..
ఇటీవలే ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లల్లో కూడా ఛార్జీలను నియంత్రించాలని, దీన్ని ధనిక వర్గాల వారికి మాత్రమే పరిమితం చేసేలా వాటి రేట్లను నిర్ధారించడం సరికాదని అంటున్నారు. వందే భారత్ లో ప్రయాణించాలని భావిస్తోన్నప్పటికీ- వాటి రేట్లను చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వస్తోందని మధ్య తరగతి ప్రయాణికులు తేల్చి చెబుతున్నారు. క్రమంగా ఇది ధనిక వర్గాల వారికి మాత్రమే పరిమితం చేసేలా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
పరిశుభ్రతకు..
రైళ్లల్లో పరిశుభ్రతపై అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోన్నారు. శుభ్రత విషయంలో- ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటోన్నారు. కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లను మళ్లీ పునరుద్ధరించాలని సూచిస్తోన్నారు.
భద్రతకూ తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మహిళా ప్రయాణికులు కోరుకుంటోన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ ను ప్రమాదరహితంగా, భద్రత పరంగా అత్యంత సురక్షితంగా రూపొందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
రైళ్ల సంఖ్య..
రైళ్ల సంఖ్యతో పాటు వాటి ఫ్రీక్వెన్సీ కూడా గణనీయంగా పెంచాలని సూచిస్తోన్నారు. పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు రైళ్లల్లో తగినంత సౌకర్యాలు లేవని, చంటి బిడ్డకు పాలివ్వడానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం ప్యాసింజర్ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచేలా చర్యలు తీసుకోవాలని, వాటి రేట్లు కూడా అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోన్నారు.