ఎన్డీయే హయాంలో ఇదేనా మంచి బడ్జెట్?.. కొన్ని ముఖ్యాంశాలు
ఢిల్లీ : జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ... పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా పీయూష్ గోయల్.. సభ ముందుకు తీసుకొచ్చిన బడ్జెట్ పై హర్షం వ్యక్తమవుతోంది. రైతులు, కార్మికులు, వేతనజీవులే లక్ష్యంగా రూపకల్పన చేసిన ఈ బడ్జెట్.. ఎన్డీయే హయాంలో మంచి బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు కొందరు.
మధ్యంతర బడ్జెట్ కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు :
1. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం మాదిరిగా.. 75 వేల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తెరపైకి తెచ్చింది కేంద్రం. ఈ స్కీమ్ కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు.. సంవత్సరానికి 6వేల రూపాయల ఆర్థికసాయం అందించనుంది. దేశవ్యాప్తంగా అమలుచేయనున్న ఈ స్కీమ్ ద్వారా 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా.
2. "ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్" పేరిట అసంఘటిత రంగంలోని కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇవ్వనుంది కేంద్రం. 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి ఈ స్కీమ్ కింద పింఛను లభించనుంది. దీనికోసం 500 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. ఏప్రిల్ నుంచి అమలు కానున్న ఈ స్కీమ్ ద్వారా దాదాపు 10 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
3. ఇక వేతన జీవులకు ఊరట లభించేలా ఆదాయపు పన్ను పరిమితి శ్లాబ్ ను ఏకంగా 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. దీని ద్వారా 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. పీఎఫ్ సేవింగ్స్ లో ఆరున్నర లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను ఎగ్జెంప్షన్ ఇచ్చారు.
4. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి రూ.2 కోట్ల వరకు మూలధన లబ్ధి (కేపిటల్స్ గెయిన్స్) నుంచి మినహాయింపు. జీవిత కాలంలో ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అలాగే పేదలకు ఇళ్ల పథకం కింద 2020లోపు రిజిస్టర్ చేసుకొన్న గృహ ప్రాజెక్టులకు ఆదాయపన్ను మినహాయింపు.
5. రెండో గృహానికి కూడా అద్దె చెల్లించే వారికి ఆ మేరకు ఆదాయ పన్ను మినహాయింపు.
6. ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ.1.80 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంపు.
7. రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు .
8. పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంపు
9. పన్నులు లేకుండా గ్రాట్యూటీ పరిమితి 20 లక్షల రూపాయలకు పెంపు.. మొత్తంగా చూసుకుంటే 30 లక్షలకు పెంపు.
10. రాష్ట్రీయ గోకుల్ మిషన్కు 750 కోట్ల రూపాయలు కేటాయింపు. మత్స్య పరిశ్రమ, పాడిపరిశ్రమ పరిధిలోకి వచ్చే రైతుల కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ.
11. ప్రకృత్తి విపత్తులకు గురైన ప్రాంతాల్లో రైతు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ, నిర్ణీత కాలంలో చెల్లింపులు చేస్తే 3 శాతం వడ్డీ రాయితీ.
12. మారుమూల ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణాకి 19 వేల కోట్ల రూపాయలు కేటాయింపు
13. 59 నిమిషాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కోటి రూపాయల రుణం ఇచ్చేలా ఏర్పాట్లు
14. కార్మిక ప్రమాద బీమా లక్షన్నర నుంచి 6 లక్షల రూపాయలకు పెంపు
15. కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మత్స్యశాఖ ఏర్పాటు
16. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యం
17. రైల్వే శాఖకు బడ్జెటరీ సపోర్ట్ కింద 64, 587 కోట్ల నిధుల కేటాయింపు
18. ఇళ్లు కొనుగోలుచేసేవారికి జీఎస్టీ నుంచి మినహాయించే విషయంలో త్వరలో నిర్ణయం
19. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిని రూ.62,574 కోట్ల నుంచి రూ.76,800 కోట్లకు పెంచారు.
20. రక్షణ బలగాలకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు.
21. సైనిక దళాలకు చెందిన ఉద్యోగులకు వేతనాల పెంపు. వన్ ర్యాంక్ వన్ పింఛన్కు 35 వేల కోట్ల రూపాయలు కేటాయింపు
22. నీతి ఆయోగ్ గుర్తించిన 9 విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పోర్టళ్ల అభివృద్ధి.
23. 5 కోట్ల రూపాయల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నవారికి ఊరట. 3 నెలలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటు.
24. రానున్న 5 సంవత్సరాలలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి 8 సంవత్సరాలలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం.
25. స్వదేశీ సినీ నిర్మాణ సంస్థలకు సింగిల్ విండో క్లియరెన్స్. పైరసీ అరికట్టడంలో భాగంగా తెరపైకి సినిమాటోగ్రఫీ చట్టం.
26. హైడ్రోకార్బన్ల దిగుమతులు తగ్గించుకోవడానికి హై లెవెల్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు అమలయ్యేలా చర్యలు.
27. ఈశాన్య భారత దేశానికి కేటాయింపులు 58 వేల 166 కోట్లకు పెంపు. 2018-19 తో పోలిస్తే ఇది 21శాతం అదనం.