మొదలైన బడ్జెట్ ప్రసంగం... మదుపర్లలో తీవ్ర ఉత్కంఠ, విశ్లేషకులు ఏమంటున్నారంటే...
Recommended Video
ముంబై: 2018-19 వార్షిక బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ ప్రస్తుత ప్రభుత్వానికి చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఎన్నికల ముందు ఏవైనా పథకాలు, సంస్కరణలు ప్రకటించాలన్నా కేంద్రానికి ఇదే అసలు సిసలు అవకాశం.
జీఎస్టీ అమలు నేపథ్యంలో వస్తున్న తొలి బడ్జెట్ కూడా ఇదే. జీఎస్టీయేతర వస్తువులను మినహాయిస్తే పన్ను పద్దులన్నీ ఒకే రూపంలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కాస్త సరళంగా కనిపించే అవకాశం ఉంది.
ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉండొచ్చు...
ఎప్పటిలాగే పేదరికం, యువత, వ్యవసాయంపై ఎక్కువ దృష్టి ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే వేతనజీవులకు పన్ను ఊరట లభిస్తుందా లేదా అన్నదే సగటు మధ్యతరగతి జీవి ప్రశ్న. కేంద్ర బడ్జెట్.. ఎన్నికలకు ముందు అందరికీ ఎంతో కొంత ఇస్తుందా?.. లేదంటే సంస్కరణల బాటను కొనసాగిస్తుందా? లేదంటే ఈసారి బడ్జెట్ మధ్యే మార్గంగా ఉంటుందా? ఇదంతా మరికాసేట్లో తేలిపోతుంది..!!
మదుపర్లలో మరింత ఆసక్తి...
అటు సామాన్యుడికి.. ఇటు పారిశ్రామికవేత్తకు బడ్జెట్ ఎంత కీలకమో సగటు మదుపరికి సైతం కేంద్ర బడ్జెట్పై అంతే ఆసక్తి ఉంటుంది. అందులోనూ స్టాక్ మార్కెట్లు జీవన కాల గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్న ఈ తరుణంలో మరింత ఆసక్తి సహజం. బడ్జెట్ అనంతరం మార్కెట్ రెచ్చిపోతుందా? లేక పడిపోతుందా? ఒకవేళ స్టాక్ మార్కెట్ పడిపోతే పెట్టుబడులు పెట్టవచ్చా? దిద్దుబాటు చర్యలు ఏమైనా ఉంటాయా? ఉండవా? మదుపరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇలాంటి ప్రశ్నలు ఎన్నో.. ఎన్నెన్నో...
గత పదేళ్లలో మూడుసార్లే నష్టాలు...
బడ్జెట్ అనంతరం మార్కెట్ దిద్దుబాటుకు గురైతే తాజా పెట్టుబడులతో బరిలోకి దిగేవారూ లేకపోలేదు. అయితే గత పదేళ్ల చరిత్ర చూస్తే.. బడ్జెట్ అనంతరం నెల రోజుల్లో మూడుసార్లు మాత్రమే నిఫ్టీ ప్రతికూల ప్రతిఫలాలు.. అంటే నష్టాలను ఇచ్చింది. మిగతా సందర్భాల్లో లాభాలే వచ్చాయి. మరి ఈసారి ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.
ఆర్థిక సర్వే ఏం చెబుతోదంటే...
సోమవారం వెలువడిన ఆర్థిక సర్వే సైతం స్టాక్ మార్కెట్లకు కొన్ని నష్టభయాలు తప్పవని హెచ్చరించింది. నిధుల ప్రవాహం, అధిక ముడి చమురు ధరలు, అధిక షేర్ల ధరలను ఆర్థిక సర్వే తన నివేదికలో ఉటంకించింది. అయితే ప్రస్తుతం మార్కెట్ తీరును చూస్తే లాభాలకు ఇవి అడ్డుతగిలేలా కనిపించడం లేదు. 2017లో బడ్జెట్కు నెల రోజుల ముందు నిప్టీ ఏకంగా 11 శాతం పెరిగింది. ఆ తర్వాత(నెల రోజులు) కూడా 3 శాతం దాకా పెరిగింది. గత పది బడ్జెట్లతో పోల్చితే.. ఈసారి మాత్రం బడ్జెట్కు ముందు మార్కెట్ ఊగిసలాట తక్కువగానే ఉంది. కానీ బడ్జెట్ తర్వాత మాత్రం కొంత లాభాల స్వీకరణ జరగవచ్చనేది విశ్లేషకుల అంచనా.
ఇలా చేయొచ్చు...
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక చేసిన షేర్లపై మదుపర్లు దృష్టి సారించడం మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు. మార్కెట్ పడిన ప్రతిసారీ కొంత పెట్టుబడులు పెట్టడం కూడా మంచి వ్యూహమంటున్నారు. డిసెంబరు 2018 కల్లా నిప్టీ 12000 స్థాయిని చేరుతుందని అంచనా కడుతున్నారు. గతంలో చిన్న, మధ్య స్థాయి షేర్లలో ర్యాలీ కనిపించింది. ఈసారి ఆ బాధ్యతను పెద్ద స్థాయి షేర్లు భుజాన వేసుకునే అవకాశం ఉందంటున్నారు.
సొంతిల్లు అయితే...
ఇంటి నిర్మాణం జరుగుతున్నపుడు, రుణంపై విధించే వడ్డీని 5 వార్షిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది నుంచి ఇది చెల్లించాల్సి వస్తుంది. ఇందులోనే యజమాని సొంతగా నివసిస్తే, ఏడాదికి రూ.2 లక్షల వరకు వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే గృహరుణ చెల్లింపునకు సంబంధించి నెలవారీ వాయిదాల్లో, వడ్డీ భాగం ఎక్కువగా ఉంటూ, గృహరుణ వడ్డీ మినహాయింపు పరిమితిని మించుతున్నందున, అదనంగా నిర్మాణ సమయానికి వడ్డీకి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. అందువల్ల నిర్మాణ సమయం వడ్డీని విడిగా పరిగణించాలి. కనీసం తొలిసారి ఇల్లు కొనుగోలుదార్లకు అయినా వర్తింప చేయాలి.
గృహరుణం చెల్లింపులో...
గృహానికి ఏర్పడే నష్టంపై, పన్ను చెల్లించే ఆదాయం నుంచి రూ.2 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నారు. దీన్ని కనీసం రూ.3 లక్షలకు పెంచాలి. ఇందువల్ల ఇంటి అద్దె కంటే, గృహరుణ వాయిదా ఎక్కువ చెల్లించే వారికి ఊరట మిగులుతుంది. గృహరుణం చెల్లింపులో, అసలుపై ఏడాదికి రూ.లక్షన్నర వరకు మినహాయింపు ఉంది. ఇది కూడా సెక్షన్ 80సి కింద ఇతర పన్ను ఆదా చేసే పథకాల్లో కలిసి ఉంది. తొలిసారి ఇల్లు కొనుగోలుదార్లకు, ఇతర పన్ను ఆదా పథకాలతో సంబంధం లేకుండా అసలుపై రూ.1.50 లక్షల మినహాయింపు ఇవ్వాలి.