పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన: మోడీ సర్కార్ కీలక నిర్ణయం: కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించడానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి పాలను విధించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సిఫారసు చేయాలని నిర్ణయించింది. అయిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలిన నేపథ్యంలో.. అక్కడ నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో భాగంగా కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.
ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో..
మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవడానికి ముందే కుప్పకూలిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఫలితంగా- బలపరీక్షను ఎదుర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో.. ఇక 12 స్థానాలకే పరిమితమైంది. అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. మరో ఒకట్రెండు నెలల్లో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నందున.. ఇప్పటికిప్పుడు బీజేపీ సహిత ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వడం కంటే.. రాష్ట్రపతి పాలనను విధించడమే మంచిదని కేంద్ర మంత్రివర్గం భావించింది. ఎలాగూ- ఒకట్రెండు నెలల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నందున.. అప్పటిదాకా పుదుచ్చేరిని రాష్ట్రపతి పాలనలో కొనసాగించాలని తీర్మానించింది.
పుదుచ్చేరి సర్కార్.. మైనారిటీలో ఇలా..
యానాం కాంగ్రెస్ ఎమ్మెల్యే, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సహా మొత్తం ఆరుమంది రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ జాన్ కుమార్, ఆర్ముగం నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు, థెప్పయ్యంథన్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. వారిలో నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు మంత్రులు కూడా. ఆదివారం సాయంత్రం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కే లక్ష్మీనారాయణన్, మిత్రపక్షం డీఎంకేకు చెందిన కే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇదివరకే కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఎన్ ధనవేలుపై అనర్హత వేటు పడింది. దీనితో అధికార కాంగ్రెస్-డీఎంకే సంకీర్ణ కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 12 స్థానాలకే పరిమితమైంది. రాజీనామాలు పోగా మిగిలిన 26 మంది శాసనసభ్యుల బలం ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 13 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం..
అధికారం కోసం భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అందుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదని, దాని పర్యవసానంగానే ప్రభుత్వం మైనారిటీలో పడిందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్-ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అడ్రస్ గల్లంతవుతుందని చెప్పారు. కేంద్రం వైఖరిని తాము ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించిందని ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.