మోడీ మంత్రివర్గంలో కొత్తగా 9 మంది! ఏ క్షణాన్నైనా తుది జాబితా, శ్రీరామ్ రెడ్డి, హరిబాబులకు చోటు?
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ప్రధాని మోడీ కొత్తగా 9 మందికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. మరికొంతమంది శాఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. కొత్తగా 9 మందికి కేంద్ర కేబినెట్ లో చోటు లభించింది. మరికొంత మంది మంత్రుల శాఖలు మారే అవకాశముంది. ఆదివారం (సెప్టెంబర్ 3) ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ నూతన కేంద్ర మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.
5 రాష్ట్రాలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పావులు కదిపారు. మరోవైపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మిత్రపక్షాలైన శివసేన, జేడీయూ అలక వహించాయి. బీజేపీ తీరుపై శివసేన, జేడీయూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్నాడీఎంకేకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందో లేదో ఇప్పటికైతే తెలియడం లేదు.
ఏ క్షణాన్నైనా మంత్రివర్గం తుది జాబితా...
కేంద్ర మంత్రివర్గం కూర్పుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. మోడీ హయాంలో మూడోసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఏ క్షణాన్నైనా మంత్రివర్గం జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దఫా విస్తరణలో పలువురు కొత్తవారికి మంత్రి పదవులు దక్కనున్నాయి.
మంత్రివర్గం నుంచి వీరు ఔట్...
శుక్రవారం సాయంత్రం వరకూ ఏడుగురు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఉమాభారతి, కల్రాజ్ మిశ్రాలు కేబినెట్ హోదా మంత్రులు కాగా బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో ఉన్నారు. మిగిలిన నలుగురు...రాజీవ్ ప్రతాప్ రూఢీ, సంజయ్ కుమార్ బల్యాన్, ఫగ్గన్ సింగ్ కులస్థే, మహేంద్రనాథ్ పాండే సహాయ మంత్రులు. వీరి పనితీరుపై ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉమాభారతి ఆ విషయంపై మాట్లేందుకు విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ అంశంపై భాజపా అధ్యక్షుడు అమిత్షా లేదా ఆయన అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే మాట్లాడగలరని ఆ తర్వాత ట్విటర్లో పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ రాజీనామా చేశామని రాజీవ్ ప్రతాప్ రూఢీ, సంజీవ్ బల్యాన్ వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయం సరైనదేనని సమర్థించారు. ఇక కేంద్ర మంత్రి దత్తాత్రేయ విషయానికొస్తే.. హైదరాబాద్ లో ఉన్న ఆయనకు ప్రధాని మోడీ నేరుగా ఫోన్ చేసి రాజీనామా చేయమని సూచించినట్లు సమాచారం. ఒక కేసులో దత్తాత్రేయపై అవినీతి ఆరోపణలు రావడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
కొత్తగా మంత్రి పదవులు ఎవరికంటే...
కేంద్ర మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి చోటు కల్పించారు. శివప్రతాప్ శుక్లా(రాజ్యసభ ఎంపీ, యూపీ), అశ్విని కుమార్ చౌబే(బీహార్ ఎంపీ), వీరేంద్ర కుమార్(మధ్యప్రదేశ్ ఎంపీ), అనంత కుమార్ హెగ్డే(కర్ణాటక ఎంపీ), రాజ్ కుమార్ సింగ్ (బీహార్ ఎంపీ) గజేంద్ర సింగ్ షెకావత్(రాజస్థాన్), సత్యపాల్ సింగ్(యూపీ), అల్ఫాన్స్ కన్నంతనమ్, హర్దీప్ సింగ్(1974 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి) లకు మంత్రి పదవులు దక్కాయి.
కొందరి శాఖల మార్పు.. ఎవరికి ఏ శాఖ?
వివిధ కారణాల వల్ల మంత్రి పదవులు కొన్ని ఖాళీ అవటంతో సీనియర్ మంత్రులు అదనంగా ఆయా శాఖల బాధ్యతలను చూస్తున్నారు. అరుణ్ జైట్లీ, హర్షవర్దన్, స్మృతీ ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఒకటికి మించిన శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గం విస్తరణతో వీరిపై అదనపు భారం తగ్గనుంది. కేంద్ర మంత్రి ఉమాభారతి విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఆమెను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని కూడా చెబుతున్నారు. బహుశా ఆమె శాఖ మారే అవకాశం ఉంది. ఇక ఇటీవల వరుస రైలు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రాజీనామా విషయంలో ప్రధాని మోడీ వారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేష్ ప్రభు శాఖ మారనున్నట్లు సమాచారం. ఆయనకు రక్షణ శాఖను కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ రైల్వే శాఖను ప్రకాష్ జవదేకర్ కు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ గడ్కరీకి నౌకాయానంతోపాటు రహదారులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు కూడా కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి బయలుదేరిన నితిన్ గడ్కరీ ఢిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవబోతున్నట్లు తెలుస్తోంది. రవిశంకర్ ప్రసాద్, అశోక్ గజపతి రాజు శాఖలు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లటంతో ఖాళీ అయిన పట్టణాభివృద్ధి శాఖను ప్రధాని మోదీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్కు అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ శాఖను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ అదనంగా చూస్తున్నారు.
కొంతమంది మంత్రులకు ప్రమోషన్...
పనితీరు బాగా ఉన్న నలుగురైదుగురు కేంద్ర మంత్రులకు ప్రమోషన్ లభించవచ్చని తెలుస్తోంది. కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయూష్ గోయల్, చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (ఇద్దరూ స్వతంత్ర బాధ్యతలు) చక్కని పనితీరు కనబరుస్తున్నారని ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వీరికి కేబినెట్హోదా లభించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అసంతృప్తిలో జేడీయూ.. నితీశ్ కీలక వ్యాఖ్యలు...
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇటీవలే ఎన్డీఏలో చేరిన జేడీయూకి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గం విస్తరణకు సంబంధించి జేడీయూలో తీవ్ర అసంత్పప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. రెండే మంత్రి పదవులు ఇస్తామని మోడీ పేర్కొనడంపై జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జేడీయూకి కానీసం మూడు మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ అధిష్ఠానం నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని, ఈ విషయం గురించి తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని ఆయన వ్యాఖ్యానించడం చూస్తే బీజేపీ ప్రతిపాదన నచ్చలేదన్నది అంతర్లీనంగా అర్థమవుతోంది.
అన్నాడీఎంకేకు నో ఛాన్స్? అలకబూనిన శివసేన
కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన అలక వహించింది. ప్రధాని మోడీ తనను సంప్రదించకుండానే మంత్రివర్గ విస్తరణ కసరత్తు చేస్తుండడంపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అన్నాడీఎంకే కు మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కానరాలేదు. అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై ఇప్పటికే ప్రధాని మోడీకి మంత్రి వర్గంలో ఆ పార్టీకి చోటు గురించి విజ్ఞప్తి చేసినా, ప్రధాని నుంచి ఇంకా ఎలాంటి స్పందన కానరావడం లేదు.
తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్ రెడ్డికే ఛాన్స్...?
తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన స్థానంలో ఎవరినీ తీసుకుంటారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జల వనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. భువనగిరికి చెందిన వెదిరె శ్రీరామ్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 15 ఏళ్ల పాటు అమెరికాలోని ఓ మల్టీ నేషన్ కంపెనీలో పని చేసిన శ్రీరామ్ రెడ్డి 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ప్రస్తుతం గంగా నది ప్రక్షాళన దిశగా మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వెనక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. దత్తాత్రేయ స్థానంలో పార్టీ సీనియర్ నేత మురళీధర్రావును తీసుకుంటారని తొలుత వినిపించినా.. తాజాగా రేసులోకి వెదిరె శ్రీరామ్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి కి కూడా మంత్రి పదవి దక్కవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
కంభంపాటికి హైకమాండ్ పిలుపు.. హస్తినకు పయనం
కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరగనున్న నేపథ్యంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కే అవకాశంపై వార్తలు వస్తోన్న నేపథ్యంలో హస్తినకు బయల్దేరి వెళ్లడంతో ఆయనకు దాదాపు మంత్రి పదవి ఖరారైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి పయనమైనట్లు సమాచారం.