2వేల రూపాయల నోట్లు రద్దు.. బ్యాంకుల నుంచి ఆ కరెన్సీ వెనక్కి.. మోదీ సర్కార్ ఏం చెప్పిందంటే..
దేశంలోని అతిపెద్ద జాతీయ బ్యాంకు తన శాఖలన్నింటికీ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీచేసింది. చిన్న పట్టణాలు మొదలుకొని మెగా సిటీల దాకా అన్ని బ్రాంచ్లకు ఉన్న రూ.2వేల రూపాయాల నోట్లను వెనక్కి పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఏటీఎంలలో రూ.2వేల నోట్లు పెట్టొద్దని, వాటి స్థానంలో రూ.100 నోట్లను ఉంచాలని చెప్పారు. సరిగ్గా పది రోజులకిందట(ఫిబ్రవరి 7న) ఈ ఆదేశాలు జారీ అయినట్లు జాతీయ మీడియాలో రిపోర్టులు వచ్చాయి.
అదీగాక కొంత కాలంగా బహిరంగ మార్కెట్ నుంచి రెండు వేల రూపాయాల నోటు కనిపించకుండా పోతోంది. దీంతో రూ.2వేల నోట్లు కచ్చితంగా రద్దవుతాయంటూ ప్రచారం ఉధృతమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు.
అసలేం జరుగుతోంది?
దేశ ఆర్థిక గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చసిన పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్) ప్రక్రియ తర్వాత రూ.2వేల కరెన్సీ నోటు అందుబాటులోకి వచ్చింది. ఆ నోట్లను కేంద్రం రద్దు చేయనుందని గత మూడేళ్లుగా పుకార్లు వస్తూనేఉన్నాయి. అయితే, గతేడాది అక్టోబర్ నుంచి రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపేశామని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించడం, ఆ కరెన్సీలో లోపాలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేయడం, బడ్జెట్ ప్రకటించిన వారం రోజులకే రూ.2వేల నోట్లు నిలిపేయాలంటూ బ్యాంకులాకు ఆదేశాలు రావడం తదితర పరిణామాలన్నీ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పట్టుపబడుతోన్న నకిలీ కరెన్సీలో రూ.2వేల నోట్ల శాతం రోజురోజుకూ పెరుగుతుండం కూడా రద్దు అనుమానాలను మరింత పెంచాయి.
నిర్మల ఏం చెప్పారంటే..
ఈనెల 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై పారిశ్రామిక వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె.. ఇక్కడి పారిశ్రామికవేత్తలు, బిజినెస్ ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బడ్జెట్ అంశాలపై వివరణ ఇస్తున్న సమయంలోనే రూ.2వేల నోటు రద్దు ప్రస్తావన వచ్చింది. రూ.2వేల నోట్లను రద్దు చేసే ఆలోచనేదీ మోదీ సర్కారుకు లేదని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. అలా జరగబోతున్నదంటూ వస్తున్న వార్తల్ని నమ్మొద్దని ఆమె చెప్పారు. అయితే బ్యాంకులకు ఆదేశాలు, నకిలీ నోట్ల గురించి మాత్రం ఆమె సమాధానాన్ని దాటవేశారు. ఆ నకిలీలల షాకింగ్ అంశాలు ఏవంటే..
దొరికిన నకిలీలో 61శాతం 2వేల నోట్లే..
నల్లధనం, నకిలీ కరెన్సీ, టెర్రరిజానికి ఫండింగ్ అరికట్టడానికే డీమానిటైజేషన్ చేపట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2016, నవంబర్ 8న ప్రకటించారు. అయితే 2017లో దేశవ్యాప్తంగా పోలీసులు, ఇతర సెక్యూరిటీ సంస్థలకు పట్టుపడిన నకిలీ కరెన్సీలో 53.5 శాతం వాటా రూ.2వేల రూపాయాలదేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) పేర్కొంది. అంతేకాదు, 2018 నాటికి నకిలీ కరెన్సీలో రెండు వేల రూపాయాల నోటు వాటా 61.1 శాతానికి పెరిగిందనీ తెలిపింది. 2019 అక్టోబర్ లో రెండు వేల రూపాయల నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపేసిన తర్వాత కూడా నకిలీ నోట్ల వరద ఆగలేదు. గత ఆదివారం(ఫిబ్రవరి 9న) దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అధికారులు రూ.23.86లక్షల విలువైన నకిలీ రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకులకు ఆదేశాలెందుకు?
రూ.2వేల నోట్లను సర్కులేషన్లో ఉంచరాదంటూ బ్యాంకులకు వచ్చిన ఆదేశాలపై ఇప్పటిదాకా ప్రభుత్వ శాఖలేవీ ప్రకటన చేయలేదు. అయితే నోట్ల తొలగింపు జరిగిపోతుండటం మాత్రం రోజువారీగా అందరూ చూస్తున్నదే. కొంత కాలంగా ఏటీఎంలలో రూ.2వేల నోట్లు రాకపోవడమే అందుకు నిదర్శనం. పోనీ నకిలీ నోట్లను గుర్తించడానికే కరెన్సీని తాత్కాలికంగా నిలిపేశారా? అని అనుకోడానికీ వీల్లేదు. ఎందుకంటే దాదాపు అన్ని శాఖల్లో నకిలీ నోట్లను పసిగట్టే యంత్రాలున్నాయి. ఎక్కడిక్కడ నకిలీ నోట్లను గుర్తించే వీలున్నప్పటికీ మొత్తంగా రూ.2వేల నోట్లను వెనక్కి పంపాలన్న ఆదేశాలు ఎందుకు జారీ అయ్యాయో తెలియాల్సిఉంది.