కర్ణాటకలో వరదలు, నిర్మలా సీతారామన్, 1. 45 లక్షల మంది, ఆర్మీ హెలికాప్టర్లు !
బెంగళూరు: భారీ వర్షాలతో కర్ణాటకలోని అనేక జిల్లాలను వదరలు ముంచెత్తుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. కర్ణాటకలోని వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను నేరుగా కలుసుకున్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ధైర్యం చెప్పారు. బెళగావి జిల్లాల్లోని 14 తాలుకాల్లో 327 పరిహార కేంద్రాలు ఏర్పాటు చేశారు. భాదితులకు ఆర్మీ హెలికాప్టర్లలో ఆహారం అందిస్తున్నారు. పరిహార కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. పరిహార కేంద్రాల్లో చిన్నారులతో పాటు ఇప్పటి వరకు 82, 425 మంది ఆశ్రయం పొందారని అధికారులు తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాలను పరిశీలించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
బెళగావి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. శనివారం బెళగావి నగరంలోని వివిద ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన ప్రజలు తలదాచుకున్న పరిహార కేంద్రాలను నిర్మలా సీతారామన్ పరిశీలించారు. వరదల కారణంగా రోడ్డున పడిన ప్రజలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓదార్చారు.
అధికారులకు ఆదేశం
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను వెంటనే ఆదుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎంత నష్టం జరిగింది !
శనివారం మద్యాహ్నం బెళగావి, బాగల్ కోటే జిల్లాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది అనే పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ, ఎన్ డీఆర్ఎఫ్, పోలీసు, నౌకాదళం, హోం గార్డ్స్, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంట ఎంపీ సురేష్ అంగడి, స్థానిక అధికారులు ఉన్నారు.
1.45 లక్షల మంది
మహారాష్ట్రలో కురుసుకున్న భారీ వర్షాల దెబ్బకు పొరుగున ఉన్న కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని 14 తాలుకాలు నీట మునిగాయి. 14 తాలుకాల్లోని 1. 45 లక్షల మంది ప్రజలను ఇప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని 28, 103 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లాధికారి డాక్టర్ ఎస్.బి. బోమ్మనహళ్ళి తెలిపారు.
రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు
బెళగావి జిల్లాలోని 14 తాలుకాల్లోని 323 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. రక్షణ శాఖకు చెందిన మూడు హెలికాప్టర్ల సహాయంతో వరద భాదితులను రక్షించి సురక్షిత కేంద్రాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు హెలికాప్టర్ల సహాయంతో ఆహారం, మంచి నీరు అందిస్తున్నారు. రంగంలోకి దిగిన రక్షణ, నౌకాదళ సిబ్బంది వరదల్లో కొట్టుకుని వెలుతున్న 32 మంది ప్రాణాలు రక్షించారు.