నాడు ఆర్టికల్ 370..నేడు మరో మిషన్: కాస్సేపట్లో కేంద్ర కేబినెట్ సమక్షానికి..రంగంలో అమిత్ షా.. !
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ మరో ప్రతిష్ఠాత్మక అంశాన్ని భుజానికెత్తుకోనుందా? ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోన్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతన అడుగును ముందుకే వేయబోతోందా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. అదే- పౌరసత్వ సవరణ బిల్లు. కాస్సేపట్లో ఈ అంశం కేంద్ర కేబినెట్ సమక్షానికి రాబోతోంది. కేంద్ర కేబినెట్ లో ఈ బిల్లు విషయంపై చర్చించడానికి ముందే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.
Chandrayaan 2: విక్రమ్ ల్యాండర్ శకలాల గుర్తింపుపై నాసా ప్రకటనను తోసిపుచ్చిన ఇస్రో ఛైర్మన్ శివన్.. !
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు శర్బానంద సొనొవాల్ (అస్సాం), జొరంథంగా (మిజోరం) దీనికి హాజరు కానున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా దీనికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ముగ్గురూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలనేది కేంద్రప్రభుత్వం యోచన. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల ఆధీనంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ నిరసనను వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్ నాథ్ (మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), అమరీందర్ సింగ్ (పంజాబ్), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీన్ని వ్యతిరేకించారు.
ఆ తరువాత ఈ అంశంపై అమిత్ షా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినప్పటికీ..పూర్తిగా ఎత్తేయలేదనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేసినట్టయింది. పౌరసత్వ సరవణ బిల్లుపై కేంద్ర కేబినెట్ లో చర్చించడం, దానిపై ఆమోదం తెలియజేయడానికి బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.