బాలాకోట్ పై వైమానిక దాడులకు సాక్ష్యాలు చూపించండి: ఇమ్రాన్ ఖాన్ కు థ్యాంక్స్
ఇండోర్: పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పై భారత వైమానిక దళం నిర్వహించిన దాడుల ఘటనకు సంబంధించి సాక్ష్యాలు కావాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే తాము విశ్వసిస్తామని చెబుతోంది. దాడులకు సంబంధించిన సాక్ష్యాలను దాచి పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ను బేషరతుగా విడుదల చేసినందుకు కాంగ్రెస్ పార్టీ.. ఆ దేశ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ధన్యావాదాలు తెలియజేసింది.
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని, పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పట్టణ సమీపంలో ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ కు చెందిన అతిపెద్ద శిక్షణ శిబిరాన్ని వైమానిక దళం నేటమట్టం చేసిన విషయం తెలిసిందే. దీనికోసం బుధవారం తెల్లవారు జామున భారీ ఎత్తున వైమానిక దాడులు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
లాడెన్ ను మట్టుబెట్టిన సాక్ష్యాలను అమెరికా బహిర్గతం చేయలేదా?
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాంకేతికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో బాలాకోట్ పై వైమానిక దాడులకు సంబంధించిన ఫొటోలను సేకరించడం పెద్ద సమస్య కాదని అన్నారు. ఉపగ్రహాల ద్వారా ఫొటోలు, వీడియోలను సేకరించి, వాటిని బహిర్గతం చేయాలని దిగ్విజయ్ సింగ్ కేంద్రానికి సూచించారు. అసలు బాలాకోట్ పై దాడులు జరిగాయా? లేవా? అనే విషయంపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోతుందని చెప్పారు.
తాను భారత వైమానిక దళ దాడులను వ్యతిరేకించట్లేదని దిగ్విజయ్ సింగ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైమానిక దాడులు సమర్థనీయమేనని అన్నారు. వైమానిక దళ అధికారుల చిత్తశుద్ధిని తాను శంకించట్లేదని అన్నారు. ఆ దాడులకు సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే బహిర్గతం చేయాలని సూచిస్తున్నానని చెప్పారు. పాకిస్తాన్ పై కొనసాగించిన సర్జికల్ స్ట్రైక్ లను 26/11 ముంబైపై ఉగ్రదాడుల తరువాత అప్పటి యూపీఏ ప్రభుత్వం నిలిపివేసిందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన విమర్శలను డిగ్గీరాజా తిప్పి కొట్టారు. తాము మోడీలా అబద్ధాల కోరులం కాదని చెప్పారు.
కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా నౌకాదళానికి చెందిన సీల్స్ పాకిస్తాన్ లోని అబోట్టాబాద్ లో మట్టుబెట్టిందని.. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను బహిర్గతం చేసిందని ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో బాలాకోట్ దాడులకు సాక్ష్యాలను కూడా వెల్లడించాలని అన్నారు.
ఇమ్రాన్ కు థ్యాంక్స్..
వైమానిక దాడులు చోటు చేసుకున్న మరుసటి రోజు నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న పరస్పర వైమానిక దాడుల్లో పాకిస్తాన్ చెరలో చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ ను బేషరతుగా విడుదల చేసినందుకు దిగ్విజయ్ సింగ్.. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపారు. వింగ్ కమాండర్ ను ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి షరతుల్లేకుండా విడుదల చేశారని, రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి సరికొత్త మార్గాన్ని భారత్ కు చూపించినట్టయిందని అన్నారు. పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్ లను కూడా భారత్ కు అప్పగించాలని కోరారు.