అమిత్ షా కుమారుడికి కీలక పదవి..కేంద్రమంత్రి సోదరుడికి ట్రెజరీ: బీసీసీఐలో ఏం జరుగుతోంది!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి..బీసీసీఐ. ప్రపంచ క్రికెట్ ను శాసించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి దీనికి. అలాగే- రిచ్చెస్ట్ బోర్డు కూడా. మ్యాచ్ లను ప్రసారం చేసే హక్కులను విక్రయించటం ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కళ్ల చూస్తోంది బీసీసీఐ. అలాంటి బీసీసీఐ కాషాయమయమైందా?, బీసీసీఐపై తన ముద్రను వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడికి కీలక బాధ్యతలను అప్పగించడమే.
The new team at. @bcci .. hopefully we can work well .. anurag thakur thank you for seeing this through @ianuragthakur pic.twitter.com/xvZyiczcGq
— Sourav Ganguly (@SGanguly99) October 14, 2019
కార్యదర్శిగా జయ్ షా.. కోశాధికారిగా అరుణ్ ధుమల్
బీసీసీఐ కార్యదర్శిగా అమిత్ షా కుమారుడు జయ్ షా ఎంపికయ్యారు. ఆయనతో పాటు కోశాధికారిగా అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమల్ నియమితులయ్యారు. వారిద్దరి పేర్లకు బీసీసీఐ అత్యున్నత పరిపాలన కమిటీ ఆమోదం తెలిపింది. బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీతో పాటు వారిద్దరు త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సౌరబ్ గంగూలీ చేతికి బీసీసీఐ పగ్గాలను అప్పగించడంపై ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాలేదు. అనేక టెస్టులు, వన్డే మ్యాచ్ లను ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్ కావడంతో.. సమర్థుడినే నియమించారనే ప్రశంసలు సగటు క్రికెట్ అభిమాని నుంచి వ్యక్తమౌతున్నాయి.
కార్యదర్శి, కోశాధికారి పదవుల పట్ల మిశ్రమ స్పందన..
ఎటొచ్చీ- జయ్ షా, అరుణ్ ధుమల్ ల ఎన్నిక పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. క్రికెట్ పై కూడా తనదైన ముద్ర వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి వారిద్దరి నియామకాలే నిదర్శనమని అంటున్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ శక్తిమంతమైన పార్టీగా ఆవిర్భవించిందని, అదే తరహాలో ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ సైతం అదే స్థాయిలో రాణిస్తుందంటూ బీజేపీ అనుకూల వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ టీమ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోందని, దీన్ని మరి కొన్నేళ్ల పాటు కొనసాగించేలా బీసీసీఐ పాలక వర్గం కీలక నిర్ణయాలను తీసుకుంటుందని చెబుతున్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికే అనురాగ్ ఠాకూర్ సోదరుడికి కోశాధికారి పదవిని ఇచ్చారనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.
క్రికెట్ లో రాజకీయాలా?
క్రీడారంగంలో రాజకీయాలను జొప్పించే ప్రయత్నానికి బీజేపీ వారిద్దరి నియామకాల ద్వారా తెర తీసిందంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు. జయ్ షా, అరుణ్ ధుమల్ ల నియమాకాలు దేశ క్రీడా రంగానికి ఎలాంటి సంకేతాలను ఇస్తోందంటూ మండి పడుతున్నారు. వారిద్దరి నియామకాల ద్వారా అమిత్ షా.. పరోక్షంగా బీసీసీఐపై పెత్తనం చలాయించడం ఖాయంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కాగా- ఇదే తన కొత్త టీమ్ అంటూ సౌరబ్ గంగూలీ తన ట్విట్టర్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో జయ్ షా, అరుణ్ ధుమల్, అనురాగ్ ఠాకూర్ ఉన్నారు.