అమర జవాన్ల పార్థివ దేహాలకు భుజం పట్టిన రాజ్ నాథ్ సింగ్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జాతీయ రహదారిపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళి అర్పించారు. వారి పార్థివ దేహాలను తన భుజస్కందాలపై మోశారు. అమర జవాన్ల పార్థివ దేహాలను ఉంచిన పేటికలను ఆర్మీ అధికారులతో కలిసి కొంతదూరం మోశారు. వాటిని సైనిక వాహనాల్లో చేర్చారు. జమ్మూకాశ్మీర్ లోని బడ్గామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉగ్రవాదుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించడానికి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం శ్రీనగర్ వెళ్లారు. న్యూఢిల్లీ నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బడ్గామ్ వెళ్లారు. బడ్గావ్ సైనిక శిబిరంలో పేటికల్లో అమర్చిన జవాన్ల పార్థివ దేహాలకు నివాళి అర్పించారు. అనంతరం.. సైన్యాధికారులతో మాట్లాడారు. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఫోన్ లో మాట్లాడారు.
అమర జవాన్ల పార్థివ దేహాలను వెంటనే వారి వారి గమ్యస్థానాలకు చేర్చాలని, వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని సూచించారు. అనంతరం వారి పార్థివ దేహాలను ఉంచిన పేటికలను నలుగురితో కలిసి భుజం పట్టారు. రాజ్ నాథ్ సింగ్ తో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్ సింగ్ కూడా ఆ పేటికలను మోశారు. శిబిరాల్లో ఉంచిన ఆ పేటికలను బయటికి తీసుకొచ్చి, అక్కడే ఉంచిన సైనిక వాహనంలో చేర్చారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టేది లేదని ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
Budgam: Union Ministers Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier. #PulwamaAttack pic.twitter.com/hF5CmYb1yR
— ANI (@ANI) February 15, 2019