ఉగ్రవాద దాడుల ప్రత్యక్ష ప్రసారాల్ని నిషేధించండి: కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక దాడులను టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధించాలని కేంద్ర హోం శాఖ కోరుతోంది. ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు తీసుకురావాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ విషయం పరిశీలనలో ఉందని అంటున్నారు. 26/11 ముంబై దాడుల సందర్భంగా ఎన్ఎస్జీ ఆపరేషన్లను వార్తా చానళ్లు లైవ్ కవరేజిగా అందించాయని హోం శాఖ తెలిపింది.
ఇలాంటి కవరేజి ఆపరేషన్ గోప్యత, తీవ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆపరేషన్లో పాల్గొంటున్న భద్రత బలగాలు, పౌరులు, జర్నలిస్టుల రక్షణను సైతం అనిశ్చితిలో పడేస్తుందని హోం శాఖ తన ఆందోళనను లేఖలో పేర్కొంది.
26/11 ముంబై దాడుల తర్వాత నేషనల్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ మీడియా సంస్ధలకు ఉగ్రవాద దాడులు జరిగే సమయంలో లైవ్ కవరేజిపై కొన్ని నిబంధలను విధించింది. ఐతే అధికారికంగా లైవ్ కవరేజిపై నిషేధం విధించలేదు.
యూపీఏ హయాంలో అప్పటి సమాచారం, ప్రసార శాఖ మంత్రి ఆనంద్ శర్మ నిషేధం కోసం ప్రయత్నించినా అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి ప్రధాని మన్మోహాన్ సింగ్ నిషేధంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1994లో కేబుల్ నెట్వర్క్ నిమయాల కింద కొన్ని రూల్స్ను తీసుకువచ్చారు. 2009లో కొన్ని ప్రైవేటు మీడియా సంస్ధలు ఆ కేబుల్ నెట్ వర్క్లో చేరడంతో నియమాలను పూర్తిగా మార్చేశారు.