కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే హత్యకు కుట్ర ? జస్ట్ మిస్, వన్ వేలో లారీ, ఏఎస్ఐ !
బెంగళూరు: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి, కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా లోక్ సభ సభ్యుడు అనంత్ కుమార్ హెగ్డే హత్యకు కుట్ర జరిగిందా ? అనే కోణంలో హావేరి జిల్లా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తనను అంతం చెయ్యడానికి ఓ వర్గం ప్రయత్నాలు చేసిందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆరోపించారు. కేంద్ర మంత్రి కారు జస్ట్ మిస్ కావడంతో వన్ వేలో వేగంగా వచ్చిన లారీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొనడంతో ఏఎస్ఐకి తీవ్రగాయాలైనాయి.
కేంద్ర మంత్రి జస్ట్ మిస్
మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటకలోని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలుకా హెలగేరి సమీపంలోని హైవే మీద కారులో వెలుతున్నారు. ఆ సమయంలో వన్ వేలో వేగంగా వచ్చిన లారీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కారును ఢీకొనడానికి ప్రయత్నించడంతో జస్ట్ మిస్ అయ్యింది.
ఏఎస్ఐకి తీవ్రగాయాలు
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వాహనాన్ని ఢీకొనడానికి ప్రయత్నించిన లారీ వెనుక వెలుతున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలో కుర్చున్న ఏఎస్ఐ ప్రభుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
140 కిలో మీటర్ల వేగం
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న కారు 140 కిలోమీటర్ల వేగంలో ఉండటంతో జస్ట్ మిస్ అయ్యిందని తెలిసింది. కేంద్ర మంత్రి కారు తప్పించుకోవడంతో వెనుక వెలుతున్న ఎస్కార్ట్ వాహనాన్ని వన్ వేలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనింది. లారీ డ్రైవర్ నాసిర్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నా హత్యకు కుట్ర
లారీ డ్రైవర్ నాసీర్ లక్షం తన కారు. అయితే కారు వేగంగా వెలుతున్న సమయంలో క్షణంలో తాను తప్పించుకున్నానని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ట్వీట్ చేశారు. లారీ డ్రైవర్ నాసీర్ తనను హత్య చెయ్యడానికే నా కారును లక్షంగా చేసుకుని వన్ వేలో వేగంగా వచ్చి ఢీకొనడానికి ప్రయత్నించాడని, ఈ విషయంలో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చెయ్యాలని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మనవి చేశారు.
మద్యం సేవించాడా !
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆరోపణలపై హావేరి జిల్లా ఎస్పీ కే. పరుశురామ స్పందించారు. లారీ డ్రైవర్ నాసీర్ మద్యం సేవించలేదని, అయితే వన్ వేలో వేగంగా వచ్చి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్నాడని వివరణ ఇచ్చారు. లారీ డ్రైవర్ నాసీర్ ను విచారణ చేస్తున్నామని హావేరి జిల్లా ఎస్సీ పరుశురామ అన్నారు.
సదానందగౌడ ఆగ్రహం
అనంత్ కుమార్ హెగ్డే మీద ఓ వర్గంలోని అనేక సంఘాలు హత్య చెయ్యాలని కుట్ర పన్నాయని, ఇప్పటికే ఆయనకు అనేక హెచ్చరికలు వచ్చాయని, ఇది హత్యాయత్నమా లేక ప్రమాదమా అనే విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కేంద్ర మంత్రి సదానందగౌడ డిమాండ్ చేశారు. అసలు లారీ వన్ వేలో వేగంగా ఎలా వచ్చిందని కేంద్ర మంత్రి సదానందగౌడ ప్రశ్నించారు.
సీఎం సిద్దూకు సవాల్
సీఎం సిద్దరామయ్య గారు మీకు దమ్ముంటే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేని రాజకీయంగా ఎదుర్కొండి, అంతే కాని ఇలా అడ్డదారిలో ఆయన్ను అంతం చెయ్యడానికి ప్రయత్నిస్తే మేము రోడ్ల మీదకు వస్తాం, ఆ తరువాత ఆదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేరు అంటూ మైసూరు-కోడుగు లోక్ సభ సభ్యుడు ప్రతాప్ సింహా ట్వీట్ చేశారు.