కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
Recommended Video
బెంగళూరు:కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ వ్యాధికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్దరాత్రి దాటాక సుమారు 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన అనంతకుమార్ అక్టోబర్ 20 న ఇండియాకు తిరిగివచ్చారు. ఆ తరువాత బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అనంతకుమార్ 1959 జులై 22న బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం కర్ణాటక బీజేపీకి అధ్యక్షునిగా ఉన్న అనంతకుమార్ 6 సార్లు సౌత్ బెంగళూరు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.
అనంతకుమార్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. తొలుత 2014లో మోడీ మంత్రివర్గంలో అనంతకుమార్ ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2016లో మంత్రివర్గ విస్తరణలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలోనూ వాజ్పేయీ హయాంలోనూ అనంతకుమార్ విమానయాన శాఖ మంత్రిగా పనిచేయడం గమనార్హం.
అనంతకుమార్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ప్రజల జీవితానికి మరి ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరని లోటుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి మరణంపై సంతాపం వెలిబుచ్చారు. "నా విలువైన సహోద్యోగి మరియు స్నేహితుడు అయిన శ్రీ అనంత్ కుమార్ మృతి నాకు తీవ్ర విచారాన్ని కలుగచేసింది. ఆయన చిన్న వయస్సులోనే ప్రజాజీవితంలో ప్రవేశించి గొప్ప శ్రద్ధతో మరియు కరుణతో సమాజానికి సేవలను అందించిన గొప్ప నాయకుడు "...అని మోడి ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, నిర్మలాసీతారామన్ తదితరులు కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అనంతకుమార్ కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.