నమ్మకం లేని చోట ఉండలేం: ఎన్డీఏకు గుడ్ బై: మంత్రివర్గం నుంచి వైదొలగిన సావంత్
ముంబై: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి శివసేన వైదొలగింది. ఈ విషయాన్ని ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు అరవింద్ గణపత్ సావంత్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడంలో భాగంగా తాన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం ముంబైలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించినట్లు తెలిపారు. నమ్మకం లేని చోట పని చేయడంలో అర్థం లేదని స్పష్టం చేశారు.
ఎన్సీపీ షరతులకు లోబడి..
అరవింద్ సావంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ముంబై దక్షిణం స్థానం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్ రాపై ఘన విజయాన్ని నమోదు చేశారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విధించిన షరతుకు అనుగుణంగా, శివసేన సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.
శివసేన తరఫున అరవింద్ సావంత్ ఒక్కరే..
శివసేన తరఫున ఆయన ఒక్కరే కేంద్రమంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తేనే తాము శివసేనను విశ్వసిస్తామని ఎన్సీపీ వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 30వ తేదీన తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశానని, తనకు భారీ పరిశ్రమల శాఖను కేటాయించారని అన్నారు. మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని సావంత్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం తమ నాయకుడు ఉద్ధవ్ థాక్రే 50-50 ఫార్ములాను ప్రతిపాదించారని, దీనికి బీజేపీ అంగీకరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.
వారి ఆశలు నెరవేరుతాయి..
శివసేనపై విశ్వాసం లేకపోవడం వల్లే బీజేపీ నాయకత్వం తమ పార్టీ అధినేత ప్రతిపాదించిన పార్ములాను అంగీకరించలేదని అన్నారు. నమ్మకం లేని చోట పని చేయడం వృధా అనే సంకేతాన్ని బీజేపీ ఇచ్చినట్టయిందని చెప్పారు. మనసు చంపుకొని పని చేయాలనే ఆలోచన తనకు లేదని, ఆ ఉద్దేశంతోనే తాను మంత్రివర్గం నుంచి వైదొలగినట్లు అరవింద్ సావంత్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకునే వారిలో తాను అగ్రస్థానంలో ఉంటానని అన్నారు. శివసేన నాయకుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, వారి ఆశలు నెరవేరుతాయని చెప్పారు.
దోస్తీ తెగదెంపులైనట్టే..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో.. సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేచాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లపై ఆధార పడింది. ప్రత్యేకించి ఎన్సీపీ. ఎన్సీపీతో దోస్తీ కట్టాలీ అంటే ఆ పార్టీ విధించే షరతులకు శివసేన తల ఊపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు లిఖితపూరకంగా హామీ ఇవ్వడంతో పాటు శివసేన ఎంపీలు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎన్సీపీ షరతు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.