బీజేపీకి షాక్: కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ రాజీనామా: ఎన్డీఏ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడి
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య మలుపు. శివసేన లోక్ సభ సభ్యుడు, కేంద్రమంత్రి అరవింద్ గణపత్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆయన భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రిగా కొనసాగారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ముంబై దక్షిణం స్థానం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్ రాపై ఘన విజయాన్ని నమోదు చేశారు. మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఎన్డీఏ నుంచి వైదొలగడం ఖాయమైనట్టే..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో.. సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేచాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లపై ఆధార పడింది. ప్రత్యేకించి ఎన్సీపీ. ఎన్సీపీతో దోస్తీ కట్టాలీ అంటే ఆ పార్టీ విధించే షరతులకు శివసేన తల ఊపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు లిఖితపూరకంగా హామీ ఇవ్వడంతో పాటు శివసేన ఎంపీలు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎన్సీపీ షరతు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఎన్డీఏ నుంచి బయటికి రావడం అంటే..
ప్రస్తుతం శివసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. శివసేన పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రులుగా కొనసాగుతున్నారు. వారందరూ తమ పదవులకు రాజీనామాలను చేయాల్సి ఉంటుందని ఎన్సీపీ షరతులు పెట్టినట్లు సమాచారం. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాపై కనీసం చర్చ అనేది కూడా లేకుండా తోసిపుచ్చడం శివసేనకు ఆగ్రహాన్ని కలిగించింది. ఇన్నేళ్లుగా కలిసి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని కనీసం రెండున్నరేళ్ల పాటైనా కేటాయించక పోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల మధ్య ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం.
తెగదెంపులకు శివసేన సై..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావాలే గానీ దేనికైనా తెగించేటట్లు కనిపిస్తోంది శివసేన దూకుడు చూస్తోంటే. ప్రత్యేకించి బీజేపీతో. బీజేపీ-శివసేన మధ్య ప్రస్తుతం టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేయడం, ఆ వెంటనే గవర్నర్ శివసేనకు ఆహ్వానాన్ని పంపడంతో సరికొత్త రాజకీయ సమీకరణాలకు బాటలు వేసినట్టయింది. 30 సంవత్సరాల పాటు బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఇక ఎన్సీపీతో జట్టు కట్టడం దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఎన్సీపీ సహకారంతో మహారాష్ట్ర పీఠాన్ని అందుకోవడానికి సన్నద్ధం కావచ్చని చెబుతున్నారు.
నేడు గవర్నర్ తో ఉద్ధవ్ థాక్రే భేటీ..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తారా? లేదా? అనే విషయాన్ని సోమవారం సాయంత్రంలోగా వెల్లడించాలని గవర్నర్ శివసేనకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ ను కలవబోతున్నారు. తమ పార్టీ శాసనసభ్యుల జాబితాతో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేల జాబితాను కూడా ఆయన తన వెంట తీసుకుని వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.