నో సిగ్నల్: చెట్టు ఎక్కి మొబైల్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి: డిజిటల్ ఇండియా అంటే !
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఇండియా నినాదంతో దూసుకు వెలుతోంది. అయితే ఓ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మొబైల్ నుంచి ఫోన్ చేసుకోవడానికి నానాతంటాలు పడి
జైపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఇండియా నినాదంతో దూసుకు వెలుతోంది. అయితే ఓ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మొబైల్ నుంచి ఫోన్ చేసుకోవడానికి నానాతంటాలు పడి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ తన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ చెట్టు ఎక్కి మొబైల్ ఫోన్ లో మాట్లాడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఓ గ్రామంలో వైద్యులు అందుబాటులో లేరని తెలుసుకున్న కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ ఫోన్ చెయ్యడానికి ప్రయత్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
రాజస్థాన్ లో అంతేనా !
రాజస్థాన్ లోని బీకానీర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి అర్జున్ మేఘవాల్ పోటీ చేసి గెలుపొంది కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన బీజేపీ సీనియర్ నాయకుడు. తన సొంత నియోజక వర్గం ప్రజల సమస్యలు తెలుసుకోని పరిష్కరించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.
సొంత నియోజక వర్గంలో పర్యటన !
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ రాజస్థాన్ లోని బీకానీర్ లోక్ సభ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన తన లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని ధోలియా గ్రామంలోకి వెళ్లారు. అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు లేరు, నానా ఇబ్బందులు !
ధోలియా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవని, ఇక్కడికి వైద్యులు రావడం లేదని, చికిత్స కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ కు చెప్పారు. మా సమస్యలు పరిష్కరించాలని మనవి చేశారు.
అక్కడే పరిష్కరించాలని !
వైద్యులు ఎందుకు రావడం లేదు ? ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదు ? అంటూ అధికారులను అడగి తెలుసుకుని అక్కడే సమస్య పరిష్కరించాలని కేంద్ర సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ సిద్దం అయ్యారు. తన మొబైల్ ఫోన్ నుంచి అధికారులతో మాట్లాడటానికి ప్రయత్నించారు.
నో నెట్ వర్క్, సర్కస్ చేసిన మంత్రి
తన మొబైల్ ఫోన్ లో నో సిగ్నల్ అని రావడంతో మంత్రి ఫోన్ పైకి పెట్టి అటు ఇటు తిప్పుతూ ప్రయత్నించారు. కొద్దిగా ఎత్తులో మొబైల్ ఫోన్ కు సిగ్నల్ వస్తోందని గుర్తించారు. అయితే అంత ఎత్తులో నిలబడి మాట్లాడటానికి మంత్రికి కష్టం అయ్యింది.
సలహా ఇచ్చిన స్థానికులు
ఆ గ్రామంలో భవనాలు లేకపోవడంతో మంత్రి మొబైల్ ఫోన్ లో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారు. అయితే తమ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు సమీపంలోని చెట్టు ఎక్కి మాట్లాడాలని గ్రామస్తులు మంత్రి అర్జున్ మేఘవాల్ కు చెప్పారు. ఇదేదో బాగుంది అంటూ మంత్రి గ్రామస్తుల మాట విని అలాగే చేస్తాను అన్నారు.
చెట్టు ఎక్కిన మంత్రి !
తాను కేంద్ర మంత్రి అనే విషయం మరిచిపోయిన అర్జున్ మేఘవాల్ వెంటనే సమీపంలోని చెట్టు ఎక్కారు. మొబైల్ సిగ్నల్ చిక్కడంతో అవతల మాట్లాడుతున్న అధికారులకు చివాట్లు పెట్టారు. వెంటనే ఇక్కడికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
తమాషాగా అనిపించినా పట్టించుకోలేదు !
కేంద్ర మంత్రి పర్యటన వివరాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన స్థానిక మీడియా సభ్యులు కేంద్ర మంత్రి చెట్టు ఎక్కిన దృశ్యాలను చిత్రీకరించి, ఫోటోలు తీశారు. వినడానికి, చూడటానికి తమాషాగా ఉన్నా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రధాన్యత ఇచ్చారని స్ఫష్గంగా వెలుగు చూసింది.
ఇదేనా డిజిటల్ ఇండియా అంటే ?
అయితే రాజస్థాన్ లోని ప్రతిపక్షాలు మాత్రం డిజిటల్ ఇండియా అంటూ కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, డిజిటల్ ఇండియా అంటే మొబైల్ ఫోన్ లో మాట్లాడటానికి స్వయంగా కేంద్ర మంత్రి చెట్టుఎక్కడమేనా ? అంటూ వ్యంగంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.