అప్పడం తింటే కరోనా దరిచేరదన్న కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్
జైపూర్: అప్పడం తింటే కరోనా దరిచేరదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి విమర్శలపాలైన కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ కరోనావైరస్ బారిన పడ్డారు.దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఇక తనకు కోవిడ్-19 వచ్చిందని స్వయంగా తెలిపారు అర్జున్ మేఘ్వాల్. రెండు సార్లు కరోనావైరస్ పరీక్షలు చేయించుకోగా రెండో రిపోర్టులో పాజిటివ్గా నిర్థారణ అయ్యిందని దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో తాను అడ్మిట్ అయినట్లు మంత్రి చెప్పారు.
కరోనావైరస్ లక్షణాలు తనలో కనిపించినందున ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకున్నట్లు మంత్రి అర్జున్ మేఘ్వాల్ తెలిపారు.ఇక రెండో రిపోర్టులో కరోనా వైరస్ పాజిటివ్గా నిర్థారణ కావడంతో డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాదు గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ కోరారు. పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
గత కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి చెప్పిన మాటలు కలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఓ బ్రాండ్ ఉన్న అప్పడాలు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజెన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు కేంద్రమంత్రి మేఘ్వాల్.
Recommended Video
భాభీజీ పాపడ్ గురించి మాట్లాడుతూ... ఆత్మనిర్భర్ భారత్ కింద ఓ అప్పడం కంపెనీ ఈ అప్పడాలు తయారు చేస్తోందని .. ఈ అప్పడం తీసుకుంటే యాంటీబాడీస్ వృద్ధి చెంది కరోనావైరస్పై పోరు చేస్తాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే మరో కేంద్రమంత్రి కైలాష్ చౌదరి కూడా కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. జోద్పూర్లోని ఓ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు.