ఎస్ఐపై కేంద్రమంత్రి గరం గరం.. యూనిఫామ్ తీసేయిస్తానంటూ చిందులు..!
బక్సర్ : డ్యూటీలో ఉన్న ఎస్ఐపై కేంద్రమంత్రి గరం గరమయ్యారు. యూనిఫామ్ తీసేయిస్తానంటూ ఫైరయ్యారు. పోలీస్ అధికారి అని చూడకుండా రెచ్చిపోయారు. నలుగురిలో తీవ్రంగా అవమానించారు. ఈ ఎపిసోడ్ అంతా సోషల్ మీడియాతో పాటు టీవి ఛానళ్లలో వైరల్గా మారడంతో విషయం కాస్తా వెలుగు చూసింది.
కేంద్ర మంత్రి అశ్విని చౌబే రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై చెలరేగి పోయారు. ఎస్ఐ అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నోటికి ఎంతొస్తే అంత అనేశారు. నలుగురిలో తనపై చిందులు వేసిన సదరు మంత్రిపై ఆ పోలీస్ అధికారి కేసు పెట్టడం చర్చానీయాంశమైంది.
బీహార్లో జనతా దర్బార్ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో కేంద్ర మంత్రి అశ్విని చౌబే సదరు ఎస్ఐ పై నోరు పారేసుకున్నారు. నీ యూనిఫామ్ ఊడబీకేయిస్తానంటూ చిందులు తొక్కారు. బక్సర్ ప్రాంతంలోని నయా భోజ్పూర్ ఔట్ పోస్టు ఎస్ఐగా పనిచేస్తున్న రాజీవ్ రంజన్కు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడంతో ఆయన పై అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా గుండాలా వ్యవహరిస్తున్న ఓ బీజేపీ కార్యకర్తకు ఆయన నోటీసులు జారీ చేయడంతో కేంద్ర మంత్రి ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అతడు కాస్తా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎస్ఐ పై చిందులు వేశారట.
తమ కార్యకర్తను ఉద్దేశించి గుండాలాగా ట్రీట్ చేస్తావా అంటూ ఎస్ఐ పై చిర్రుబుర్రులాడారు కేంద్ర మంత్రి. నీ తీరు మారకుంటే నా తడాఖా చూపిస్తానంటూ చిందులేశారు. అయితే ఈ తతంగమంతా వీడియో రూపంలో బయటకు రావడంతో అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదలావుంటే మంత్రి తీరుపై సదరు ఎస్ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంకా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది.