ముస్లింలను కుక్కల్లా కాల్చిపారేయాలి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదే చేశాం..మా తిండి తింటూ నకరాలా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలను చేసిన ముస్లింలను ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద కామెంట్లు పెనుదుమారం రేపుతున్నాయి. కామెంట్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ నష్టనివారణచర్యలకు దిగింది. దీలీప్ వ్యాఖ్యలు ముమ్మాటికీ ఖండనీయమని, ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చుకుంటోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ప్రకటనలు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్ నదియా జిల్లా కేంద్రంలో ఆదివారం సీఏఏపై జరిగిన మీటింగ్ లో దిలీప్ ఘోష్ వివాదాస్పద కామెంట్లు చేశారు. ‘‘దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ముస్లింల సంఖ్య దేశవ్యాప్తంగా రెండు కోట్లు ఉంటే.. అదులో కోటి మంది వెస్ట్ బెంగాల్ లోనే తిష్టవేశారు. సీఏఏపై నిరసనల పేరుతో పబ్లిక్ ఆస్తుల్ని ధ్వంసం చేసినవాళ్లను నడిరోడ్డు మీద కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపారేయాలి'' అని ఘోష్ అన్నారు.
యోగి అదే పని చేశారు..
సీఏఏ నిరసనలను అదుపు చేయడంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఫెయిలయ్యారని ఘోష్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా, సీఏఏ పేరుతో నిరసనకు దిగిన ముస్లింలకు బీజేపీ ముఖ్యమంత్రులు చుక్కలు చూపించారని, పోలీసులతో కాల్పులు జరిపించారనీ ఆయన చెప్పారు. ‘‘యూపీ, కర్నాటక, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లాగా నిరసనకారులపై కాల్పులకు, లాఠీచార్జిలకు మమత పర్మిషన్ ఎందుకివ్వడంలేదు?''అని ప్రశ్నించారు. ‘‘ఇక్కడికొచ్చి.. మన తిండి తిండూ.. మన దగ్గర బతుకుతూ.. మన చట్టాలకు వ్యతిరేకించడం.. మన ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి వీళ్లకెంత ధైర్యం? వీళ్లేమైనా జమీందార్లా? కుక్కల్లాగా కాల్చిపారేయాలి‘‘ అని ఫైరయ్యారు.
బీజేపీ చీఫ్ పై ఇతర నేతల మండిపాటు
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ముస్లింలను ఉద్దేశించి దిలీప్ ఘోష్ చేసిన కామెంట్లపై బీజేపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దిలీప్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, ఇలాంటి విద్వేషవ్యాఖ్యల్ని పార్టీ ఏనాడూ సమర్థించలేదని బెంగాల్ కే చెందిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. ‘‘నిరసనకారుల్ని బీజేపీ ప్రభుత్వాలు కాల్చిపారేసినట్లయితే.. జేఎన్యూలో విద్యార్థులపై దాడి చేసిన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని ఏం చెయ్యాలి?''అంటూ కర్నాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావ్ విమర్శించారు.