ఆ ప్రశ్నకు సమాధానమేది..? మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ప్రకాశ్ జవదేకర్..
ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్.. బీజేపీ నేత కపిల్ మిశ్రాపై జర్నలిస్టులు సంధించిన ప్రశ్నను దాటవేశారు. ఆ వ్యవహారం కోర్టులో ఉందని.. దానిపై తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించి అక్కడినుంచి వెళ్లిపోయారు. కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేకనే జవదేకర్.. ప్రెస్ మీట్ మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను హైకోర్టు పోలీసులకు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కమిషనర్ అమూల్య పట్నాయక్.. ఆ వీడియోలను చూడలేదని చెప్పడంతో న్యాయస్థానం కోర్టులోనే ఆ వీడియోను ప్రదర్శించింది. దీనిపై ఏమంటారని ఎన్డీటీవీ జర్నలిస్టు ప్రకాశ్ జవదేకర్ను ప్రశ్నించగా.. మీడియా సమావేశం ముగిసిందని,థ్యాంక్స్ చెబుతూ ఆయన అక్కడినుంచి వెళ్లిపోయారు.
కపిల్ మిశ్రాతో పాటు బీజేపీ నేతలు పర్వేశ్ వర్మ,అనురాగ్ ఠాకూర్ల వీడియోలను కూడా ప్రదర్శించింది. వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.కాగా, సీఏఏ ఆందోళనకారులను మూడు రోజుల్లోగా ఆందోళనలు విరమించుకునేలా చేయాలని.. లేదంటే ఆ ఆ తర్వాత పోలీసులు చెప్పినా తాము వినిపించుకోమని కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఢిల్లీలో హింస చెలరేగడం ఆయనపై విమర్శలకు తావిచ్చింది. ఇక మరో బీజేపీ నేత పర్వేష్ వర్మ.. సీఏఏ ఆందోళనకారులు మీ ఇళ్లల్లోకి దూరి అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేస్తారని.. ఢిల్లీ ప్రజలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేశారు. మరో నేత అనురాగ్ ఠాకూర్ దేశద్రోహులను కాల్చి పారేయండి అంటూ సీఏఏ ఆందోళనకారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.