షాకింగ్: కేంద్రమంత్రి అనుప్రియకు ఈవ్ టీజర్ల వేధింపులు, సెక్యూరిటీ చెప్పినా
లక్నో: కేంద్రమంత్రికి కూడా వేధింపులు తప్పలేదు. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సోమవారం అర్ధరాత్రి ఈవ్ టీజింగ్కు గురయ్యారు. ఆమె తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వారణాసి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఔరాయ్, మీర్జామురాద్ మధ్య కారులో ప్రయాణిస్తుండగా ముగ్గురు దుండగులు తనును వేధించినట్లు ఆరోపించారు. నంబరు ప్లేట్ లేని కారులో వచ్చిన ఈ దుండగులు తన కాన్వాయ్ని దాటేందుకు ప్రయత్నించారని తెలిపారు. తన భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.
అసభ్యకరవ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తన
తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, తన భద్రతా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారని అనుప్రియా పటేల్ పోలీసులకు తెలిపారు. ఆమె తన ఫిర్యాదును వారణాసి ఎస్ఎస్పీ ఆర్కే భరద్వాజ్కు సమర్పించారు. వెంటనే స్పందించిన భరద్వాజ్, పోలీసులు నిందితుల కోసం గాలించారు. మీర్జామురాద్ పోలీసులు వారిని అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు యువకులు అదే పనిగా అనుచితంగా ప్రవర్తించారు
ఆదివారం నాడు ఆమె తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె వారణాసి వెళ్తుండగా ఆ యువకులు ఈమె కారును వెంబడించి అనుచితంగా ప్రవర్తించారు. మొదట వారిని ఆమె పట్టించుకోలేదు. కానీ నెంబర్ ప్లేట్ లేని ఆ కారులోని ముగ్గురు యువకులు అదే పనిగా అనుచితంగా ప్రవర్తించడంతో సెక్యూరిటీ సిబ్బంది తొలుత హెచ్చరించి, ఆ తర్వాత వారిని వెంబడించారు.
పరిస్థితి గురించిన అనుప్రియ పోలీసులకు సమాచారం ఇచ్చారు
సెక్యూరిటీ పర్సనల్స్ వారిని హెచ్చరించి, చేజ్ చేసినప్పుడల్లా కాసేపు కారులో వేగంగా వెళ్లి కనిపించకుండా పోతున్నారు. ఆ తర్వాత మళ్లీ వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రెండు మూడుసార్లు చేశారు. పరిస్థితిని గుర్తించిన కేంద్రమంత్రి అనుప్రియ వెంటనే వారణాసి పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
పోలీసులు కారు స్వాధీనం చేసుకున్నారు
దీంతో పోలీసులు ఆ మార్గంలో రోడ్డు బ్లాక్ చేసి చెక్ చేశారు. దీంతో వారు పోలీసులకు చిక్కారు. పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వారి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యాక మహిళల రక్షణ కోసం యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేశారు.