రాజకీయ స్ఫూర్తి ప్రదాతకు కిషన్ రెడ్డి పాదాభివందనం: బీజేపీ కురువృద్ధుడికి సన్మానం
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి భారతీయ జనతాపార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. గౌరవసూచకంగా పుష్పగుచ్ఛాన్ని అందించారు. పరిపాలనలో తనకు మెళకువలు సూచించాలని కోరారు.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజు ఆయన న్యూఢిల్లీలోని ఎల్ కే అద్వానీ నివాసానికి వెళ్లారు. అద్వాని కలుసుకుని, పాదాభివందనం చేశారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. అద్వానీని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో ఆయన చేపట్టిన రథయాత్ర తనలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని అన్నారు.
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అద్వానీని సన్మానించడం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఓ సాధారణ కార్యకర్తగా ఉన్న తనను కేంద్ర మంత్రిని చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో అద్వానీ నివాసానికి వెళ్లడం తనకు చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.