మోడీ కేబినెట్లో కలకలం: మరో కేంద్రమంత్రికి కరోనా: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కేంద్రమంత్రులు ఒకరి తరువాత ఒకరు అన్నట్టుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అనారోగ్యానికి గురవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు. నిర్లక్ష్యంగా ఉండే ఏ ఒక్కర్ని కూడా కరోనా వైరస్ వదిలి పెట్టదనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల కిందటే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడ్డారు. అప్పడాలు తింటే కరోనా రాదంటూ చెప్పుకొచ్చిన జల వనరుల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వైరస్తో ఆసుపత్రి పాలయ్యారు.
ఆ విషయంలో విశాఖ కంటే విజయవాడే బెటర్: ఆరో స్థానంలో ఏపీ: టాప్-10 లిస్ట్
ఇక తాజాగా- జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో ఆయన ఆసుపత్రిలో చేరారు. అత్యవసరంగా చికిత్స పొందుతున్నారు. గజేంద్రసింగ్ షెఖావత్ పేరు కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించడంలో భాగంగా ఆయన కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ఫోన్లో సంభాషించిన విషయం తెలిసిందే.
గురువారం ఉదయం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జ్వరంతో బాధపడ్డారు.దీనితో ఆయనకు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని గజేంద్రసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారంతా హోమ్ క్వారంటైన్లలో ఉండాలని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇదివరకు అమిత్ షా, అర్జున్రామ్ మేఘ్వాల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయుష్ మంత్రి శ్రీపద్ యశోనాయక్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు వారాల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందార. ఉత్తర ప్రదేశ్లో మంత్రి కమలా రాణి వరుణ్ కరోనా వల్ల మరణించారు.