షహీన్ బాగ్లో సూసైడ్ బాంబర్లకు శిక్షణ.. దేశానికి వ్యతిరేకంగా కుట్ర.. కేంద్రమంత్రి ఆరోపణలు
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని షహీన్ బాగ్లో సూసైడ్ బాంబర్లను తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల గురించి వివరాల్లోకి వెళితే..
షహీన్ బాగ్ ఉద్యమం కాదు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ వద్ద జరుగుతున్నది ఉద్యమం కాదు. అక్కడ సూసైడ్ బాంబర్లు ట్రైనింగ్ పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నది అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తాజా వ్యాఖ్యలతో షహీన్ బాగ్ వద్ద నిరసనలు మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.
షహీన్ బాగ్ కాల్పుల ఘటనతో
డిసెంబర్ రెండో వారం నుంచి ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న ఉద్యమం జరుగుతున్నది. భారీ సంఖ్యలో మహిళలు నిరసన ప్రదర్శనలు, ధర్నాలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఈ వేదిక వద్ద అగంతకుడు కాల్పులు జరగడంతో షహీన్ బాగ్ మరోసారి వార్తల్లో కెక్కింది.
దేశ వ్యతిరేక శక్తుల పనే
ఇదిలా ఉండగా, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఏఏ అంశం, షహీన్ బాగ్ నిరసనలు మరింత ఊపందుకున్నాయి. షహీన్ బాగ్ వద్ద జరుగుతున్న నిరసనలు, ప్రదర్శనలు దేశ వ్యతిరేక శక్తుల పనేనని పలువురు మంత్రులు, ప్రధాని మోడీ స్వయంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దేశానికి వ్యతిరేకంగా కుట్ర
ఇటీవల నరేంద్రమోదీ మాట్లాడుతూ.. దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా దేశంలో రాజకీయ కుట్ర జరుగుతున్నది. షహీన్ బాగ్, జామియా, సీలంపూర్ వద్ద జరిగిన సంఘటనలు యాదృచ్చికం కాదు. ఇవి ఓ ప్రయోగాలంటివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ప్రజాస్వామబద్ధంగానే.. కాంగ్రెస్ క్లారిటీ
అయితే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ ధీటుగా స్పందించింది. పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయి. షహీన్ బాగ్ ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకొన్న ఘటనలకు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలే కారణం అని కాంగ్రెస్ ఆరోపించింది.