కరోనాపై పోరుకు అప్పడాలు... కేంద్రమంత్రి వ్యాఖ్యలతో కేంద్రం అభాసుపాలు..!!
కరోనా వేళ తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఓవైపు కేంద్రం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంటే... స్వయంగా ఓ కేంద్రమంత్రే ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపించడం వివాదాస్పదంగా మారింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్... ఓ వీడియోలో 'బాబీజీ' అనే అప్పడాల బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చారు.
ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్తో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ది చెందుతాయని అర్జున్ రామ్ మేఘ్వాల్ వ్యాఖ్యానించారు. 'ఆత్మనిర్భర్ పథకం కింద తయారీదారులు బాబీజీ పాపడ్ను తయారుచేశారు.ఇది కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. తయారీదారులకు మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను.' అని ఆ వీడియోలో రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు.
Is it possible either @DelhiPolice or @PoliceRajasthan take suo moto action against @arjunrammeghwal
— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) July 24, 2020
ji for spreading fake and unscientific information during pandemic. pic.twitter.com/wjAeAVEcP6
కరోనా వైరస్ కోసం ఓవైపు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలవగా... అప్పడాలు తింటే కరోనా పోతుందని ప్రచారం చేయడం చౌకబారుతనమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివాళ్ల కోసమే కాంగ్రెస్ హయాంలో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చామని యూత్ కాంగ్రెస్ ట్విట్టర్లో సెటైర్ వేసింది.
Recommended Video
మరికొందరు నెటిజెన్స్ మాత్రం కేంద్రమంత్రి వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నవేళ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. అయితే ఈ వీడియోపై ఇంతవరకూ బీజేపీ నుంచి కానీ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు.