చిన్నారులపై రేప్: నిందితులను ఉరితీయాలన్న మేనకా గాంధీ, కథువా ఘటనపై తీవ్ర వేదన
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూకాకాశ్మీర్లోని కథువాలో ఇటీవల చోటుచేసుకున్న 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే నిందితులను ఉరితీయాలని అన్నారు.
కథువా ఘటన గురించి తెలిసి తాను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యానని మేనక అన్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్నారు. ఇందుకోసం చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
'కథువాతో పాటు ఇటీవల చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి తెలిసి తీవ్ర కలత చెందాను. 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావాలని కోరుకుంటున్నాం' అని మేనక వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని సోమవారం కేంద్ర మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్తామని మేనకా గాంధీ చెప్పారు.
కాగా, కథువా బాధిత చిన్నారికి న్యాయం చేయాలంటూ ఇప్పటికే పలుచోట్ల ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ కూడా గురువారం అర్ధరాత్రి శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. కాగా, కథువా ఘటన కేసులో 8మంది నిందితులపై పోలీసులు గురువారం ఛార్జీ షీటు నమోదు చేశారు.
సుప్రీంకోర్టుకు కథువా కేసు
జమ్మూకాశ్మీర్కు చెందిన లాయర్ల వ్యవహారాన్ని నిరసిస్తూ కథువా బాధితురాలి తరపు న్యాయవాది ఈ కేసును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో వాదించకుండా తమను అడ్డుకుంటున్నారని సీజేఐకి వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.