కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్: యూటర్న్ తీసుకున్న కేంద్రమంత్రి మురళీధరన్
తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ను ఆ పార్టీ ప్రకటించిందని వెల్లడించిన కేంద్రమంత్రి వీ మురళీధరన్ తన మాట మార్చారు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీధరన్ ఇటీవల బీజేపీలో చేరారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు కూడా సిద్ధమని ఇటీవల శ్రీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి మురళీధరన్.. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థి శ్రీధరన్ అని ప్రకటించారు.
కేరళలో సీపీఐఎం, ఐఎన్సీలను ఓడిస్తామని, అవినీతిలేని, అభివృద్ధి కొనసాగించే తమ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత కేంద్రమంత్రి మురళీధరన్ మాటమార్చారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీధరన్ను పార్టీ ఇంకా ప్రకటించలేదని, దీనిపై అధికారిక ప్రకటనేది లేదని చెప్పారు.
Our party has announced that E Sreedharan will be the chief minister candidate (for Kerala assembly elections): MoS MEA and BJP leader V Muraleedharan pic.twitter.com/HC01OThQYm
— ANI (@ANI) March 4, 2021
అంతకుముందు కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీధరన్ను ప్రకటించాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరినట్లు తెలిపారు. మెట్రోమ్యాన్ నాయకత్వంలో కేరళలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయక్తవంలో కేరళను అభివృద్ధి చేస్తామని సురేంద్రన్ చెప్పారు.