ఎగ్జిట్ పోల్స్ను నమ్మలేం: ఇప్పటికే 50 సార్లు చెప్పా: ప్రధాని పదవిపై గడ్కరీ మరోసారి
ముంబై: దేశంలో హంగ్ ఏర్పడితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని తప్పిస్తారని, ఆయన స్థానంలో కేంద్రమంత్రి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నితిన్ గడ్కరీని కూర్చోబెడతారంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి హుటాహుటిన నితిన్ గడ్కరీని కలుసుకోవడంతో ఈ అనుమానాలను మరింత బలపర్చింది. ఈ నేపథ్యంలో.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఆయన మరోసారి స్పందించారు. తాను ప్రధానమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. తాను ప్రధాని పదవిని కోరుకోవట్లేదని ఇప్పటికే 50 సార్లు చెప్పానని గుర్తు చేశారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం ఆయన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్తో కలిసి పీఎం నరేంద్రమోడీ సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మూవీలో వివేక్.. టైటిల్ పాత్రను పోషించారు. ఈ సందర్భంగా గడ్కరీ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలో తాము సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్నామని, విజయం సాధించబోతున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి మోడీ నాయకత్వం వహిస్తారనీ చెప్పారు. ఇందులో మరో మాటకు అవకాశం లేదని తేల్చేశారు.
ఎగ్జిట్ పోల్స్ను నమ్మలేమని, అవేమి తుది ఫలితాలు కావని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఫలితాలు ఎలా ఉంటాయని ఓ అంచనాకు రావడానికే ఎగ్జిట్ పోల్స్ను నిర్వహిస్తారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ మాట ఎలా ఉన్నప్పటికీ.. కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలో రావడం ఖాయమని చెప్పారు. 300లకు పైగా స్థానాలను ఎన్డీఏ దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాల లబ్దిని అందజేయగలిగామని చెప్పారు. దేశ ప్రజలు మరోసారి మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.