కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్... ప్రస్తుతం ఐసోలేషన్లో...
కేంద్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన గడ్కరీ... ఇటీవల తనను కలిసినవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. కరోనా సోకడంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఆయన దూరం కానున్నారు.
మంగళవారం(సెప్టెంబర్ 15) కాస్త నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించినట్లు గడ్కరీ తెలిపారు. వైద్య పరీక్షల్లో తనకు కోవిడ్ 19 పాజిటివ్గా తేలిందన్నారు. అందరి ఆశీస్సులతో ఇప్పటికైతే బాగానే ఉన్నానని చెప్పారు. గడ్కరీ కరోనా బారినపడ్డారని తెలియడంతో పలువురు బీజేపీ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందిన ఆయన కరోనా నుంచి కోలుకుని అగస్టు 31న డిశ్చార్జి అయ్యారు. అంతకుముందు,కేంద్రమంత్రులు శ్రీపాద నాయక్,ధర్మేంద్ర ప్రధాన్,అర్జున్ మేఘవాల్,కైలాష్ చౌదరి కూడా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.
కాగా,భారత్లో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,123 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1290 మంది కరోనాతో మృతి చెందారు.ప్రస్తుతం 9.95లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 39.4 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 82 వేల మంది మృతి చెందారు. మంగళవారం(సెప్టెంబర్ 16) ఒక్క రోజే 11.16 లక్షల శాంపిల్స్ను పరీక్షించగా... మొత్తం 5కోట్ల 94లక్షల శాంపిల్స్ను పరీక్షించారు.
Yesterday, I was feeling weak and consulted my Doctor. During the course of my check up, I have been tested COVID 19 positive. I am at present doing well with the blessings and good wishes of all. I have isolated myself.
— Nitin Gadkari (@nitin_gadkari) September 16, 2020