ఆంధ్రప్రదేశ్కు కేంద్రం న్యాయం చేస్తుంది.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ భరోసా..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020-21పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ తమకు తీవ్ర నిరాశ కలిగించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. ఆంధ్రప్రదేశ్,జమ్మూకాశ్మీర్లను వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్-2020 చాలా బాగుందని,దేశ ఆర్థిక వృద్దికి ఇది తోడ్పడుతుందని అన్నారు.అంతేకాదు, ఈ దశాబ్దపు అత్యుత్తమ బడ్జెట్గా దీన్ని కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై భీమాను రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచడం సామాన్యులకు వరం అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందని ఓవైపు కేంద్రమంత్రి భరోసా ఇచ్చినప్పటికీ.. మరోవైపు ఏపీకి ఏమీ దక్కలేదన్న అభిప్రాయాలు వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్రం.. దానికి సంబంధించిన విధివిధానాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. నిధుల్లో కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రత్యేక హోదాతో పాటు పలు కీలక అంశాలను కేంద్రం విస్మరించిందన్నారు. కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్ట్ కూడా కేటాయించలేదన్నారు.
ఇక ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదన్నారు. బడ్జెట్లో రైతులకు పెద్ద పీట ఎక్కడ వేశారో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు.
బడ్జెట్పై వైసీపీ నేతలు పెదవి విరుస్తుంటే.. రాష్ట్రాల అంశాల ప్రతిపాదికన బడ్జెట్ను చూడటం సరికాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించడం గమనార్హం. పోలవరం ప్రాజక్టుకు కేంద్ర బడ్జెట్కు సంబంధం లేదని,అందుకు నాబార్డ్ ద్వారా కేంద్రం నిధులు ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ కేటాయింపులు చేసినట్టు తెలిపారు.