ట్విట్టర్ తెంపరితనం: నాడు వెంకయ్య నాయుడు..ఇప్పుడు కొత్త కేంద్రమంత్రి: హైఓల్టేజ్ షాక్..!
న్యూఢిల్లీ: దేశంలో వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్.. మరోమారు విమర్శల జడివానకు తెర తీసింది. వివాదాస్పద వైఖరిని ప్రదర్శించింది. ఇదివరకు ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న ఆయన వ్యక్తిగత అకౌంట్కు సంబంధించిన బ్లూ టిక్ను తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం.. తాజాగా కొత్త కేంద్రమంత్రికీ షాకిచ్చింది. ఆ మంత్రి మరెవరో కాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ట్విట్టర్పై నిషేధాన్ని విధించే అంశాన్ని పరిశీలిస్తోన్నది ఈ మంత్రిత్వ శాఖే.
ఇటీవల చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవవస్థీకరణ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ ఛైర్మన్గా వ్యవహరిస్తోన్నారాయన. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్కు బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంది. చాలాకాలం కిందటే ట్విట్టర్ మేనేజ్మెంట్ ఆయన అకౌంట్ బ్లూటిక్ను మంజూరు చేసింది. తాజాగా దాన్ని తొలగించింది. దీనికి గల కారణాన్ని ట్విట్టర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు గానీ.. రాజీవ్ చంద్రశేఖర్ తన యూజర్ పేరులో మార్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Recommended Video
ట్విట్టర్ వెరిఫికేషన్ పాలసీ ప్రకారం.. అకౌంట్ హోల్డర్.. తన యూజర్ నేమ్లో మార్పులు చేర్పులు చేస్తే.. బ్లూటిక్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. రాజీవ్ చంద్రశేఖర్ విషయంలోఇదే చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదివరకు రాజీవ్ చంద్రశేఖర్ యూజర్ నేమ్ Rajeev_mpగా ఉండేది. కేంద్రమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన తన ట్విట్టర్ యూజర్ నేమ్ను Rajeev_GoIగా మార్చారు. ఈ మార్పు వల్లే ట్విట్టర్ యాజమాన్యం ఇదివరకు ఆయనకు కేటాయించిన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించినట్లు చెబుతున్నారు.