జయతో రవిశంకర్ భేటీ, జన్ ధన్ గురించి వివరణ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెతో చర్చలు ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చర్చల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి ముఖ్యమంత్రి జయలలితకు వివరించానని అన్నారు. ఈ పథకం వల్ల పేద ప్రజలు లభ్ది పొందే ఆర్దిక ప్రయోజనాలను ఆమెకు వివరించానని అన్నారు. 'డిజిటల్ ఇండియా' కార్యక్రమం ద్వారా సాంకేతిక ఫలితాలను సామాన్యులకు అందుబాటులో తెస్తామని రవిశంకర్ తెలిపారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జన్ ధన్ యోజన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా జన్ ధన్ యోజన పథకం క్రింద తొలిరోజే కోటి ఖాతాలు ప్రారంఛిందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభంలో పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
జన్ ధన్ యోజన పథకం యొక్క లక్ష్యాలను వివరిస్తూ బ్యాంక్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా 7.25 లక్షల మెయిల్స్ పంపారు. ఆ ఆధార్ అనుసంధాన ఖాతాలకు రూ. 5వేలు ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం , పేదలకు డెబిట్ కార్డు, రూ. లక్ష భీమా సౌకర్యం కల్పిస్తారు. దేశ వ్యాప్తంగా 76 కేంద్రాల్లో జన్ ధన్ యోజన కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రస్తుత సమాజంలో ఆర్దిక ఆస్పృశ్యత ఉందని.. దీని నుండి పేదలకు విముక్తి కలిగించాల్సి అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అందరికీ బ్యాంక్ ఖాతా లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేదలు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారని, పేదల కష్టాలకు అప్పులే కారణమని నరేంద్ర మోడీ అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం పేదరిక నిర్మూళన కోసమేనని నరేంద్రమోడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్, ఆంద్రప్రదేశ్ తరఫున ఎంపీ కంభంపాటి, పలువురు బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.