కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా పాజిటివ్... త్వరగా కోలుకోవాలని నితిన్ గడ్కరీ ట్వీట్..
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందని... ఈమధ్య కాలంలో తనను కలిసినవాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను కేంద్రమంత్రి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇలా ఓ విషయాన్ని వెల్లడించేందుకు పదాల కోసం వెతుక్కోవాల్సి రావడం అరుదు అని పేర్కొన్నారు. అయితే తాను అసింప్టమాటికా లేదా సింప్టమాటికా అన్నది కేంద్రమంత్రి వెల్లడించలేదు. స్మృతీ ఇరానీ ట్వీట్పై స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 'మీరు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తాను.' అని ట్వీట్ చేశారు.
మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'దేశ ప్రజల కోసం చేసే పోరాటంలో మీరెప్పుడూ ధృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా అదే ధృఢ సంకల్పంతో మీరో కోవిడ్ 19ని ఎదుర్కోగలరు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.
కాగా,గతంలో కేంద్రమంత్రులు అమిత్ షా,నితిన్ గడ్కరీ,ధర్మేంద్ర ప్రధాన్,ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తదితరులు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయా రాష్ట్రాల్లో చాలామంది మంత్రులు,ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడి కోలుకున్నారు.ప్రస్తుతం భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80లక్షలకు సమీపంలో ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,893 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 508 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే త్వరలోనే భారత్ అమెరికాను కూడా దాటిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అమెరికాలో 87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బుధవారం(అక్టోబర్ 27) కేంద్రం అన్లాక్ 5 నిబంధనలను పొడగించిన సంగతి తెలిసిందే. నవంబర్ 30 వరకు ఆ మార్గదర్శకాలు అమలులో ఉండనునన్నాయి. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, క్రీడా శిక్షణ కేంద్రాలకు షరతులతో కూడి అనుమతి ఉంటుంది. అంతర్రాష్ట్ర రాకపోకల విషయంలో ఎటువంటి నిబంధనలు ఉండవు. అందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. సినిమా హాల్స్లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంటుంది.