'రహస్య ఆడియో టేపుల'తో కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు
న్యూఢిల్లీ : హోదా.. వ్యక్తిగత స్థాయి.. ఇవేవి బెదిరింపులు, వేధింపుల పర్వానికి అడ్డు రావట్లేదు. ఎంతటి హోదాలో ఉన్న వ్యక్తులకైనా సరే ఈ బెడద తప్పట్లేదు. తాజాగా కేంద్రమంత్రి ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ భార్య భారతీ సింగ్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తెలిసిన వ్యక్తే కదా అని ఫోన్ లో ఓ వ్యక్తితో మాట్లాడిన సంభాషణలను ఇప్పుడు బహిర్గతం చేస్తానని అతను బెదిరిస్తున్నాడంటూ.. డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు భారతి.
ఆగస్టు 6వ తేదీన చౌహాన్ అనే వ్యక్తితో తాను ఫోన్ లో మాట్లాడానని, ఆ సంభాషణలను రహస్యంగా రికార్డు చేసిన అతను బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. రూ.2కోట్లు ఇవ్వకుంటే ఆ సంభాషణలను లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. నిందితుడి నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందన్న భారతి.. కొన్ని మార్ఫింగ్ ఆడియో, వీడియోలను తన పేరిట బయటపెడుతానని చౌహన్ బెదిరిస్తున్నట్లుగా చెప్పారు.
అతని దగ్గరున్న ఆడియో, వీడియో టేపుల్లో ఏముందో తనకు తెలియదని, కానీ వాటిని బయటపెట్టి తన భర్త పరువు తీయాలని చూస్తున్నాడని వాపోయారు భారతి. కాగా, దీనిపై స్పందించిన పోలీసులు.. భారతి ఆడియోను వేరే ఆడియో సంభాషణలతో మిక్స్ చేసి నిందితుడు బెదిరింపులు దిగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.