బీజేపీ ఎమ్మెల్యేకి అన్నీ పార్టీల శ్రధ్దాంజలి, కేంద్ర మంత్రుల కన్నీరు, ఎన్నికలు వాయిదా!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ హఠాన్మరణంతో పలువురు ప్రముఖులు శ్రధ్దాంజలి ఘటించారు. జయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన బీఎన్. విజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి నామినేషన్ వేశారు. అయితే ఎమ్మెల్యే విజయ్ కుమార్ హఠాన్మరణంతో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు దాదాపు వాయిదా పడే అవకాశం ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులు విజయ్ కుమార్ కు శ్రధ్దాంజలి ఘటించారు.
ప్రముఖులు, అభిమానులు
జయనగర 4వ బ్లాక్ లోని బీజేపీ ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ ఇంటికి చేరుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. బీజేపీ ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ ను చివరిసారి చూసుకోవడానికి జయనగరతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో బీజేపీ ప్రముఖలు, ఆయన అభిమానులు తరలిరావడంతో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
షాక్ కు గురైన యడ్యూరప్ప
జయనగర నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన విజయ్ కుమార్ నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు, ఆయన ఈ శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తారని దాదాపుఖరారు అయ్యింది, ఇలాంటి సమయంలో ఆయన హఠాన్మరణం చెందడంతో తాను షాక్ కు గురైనానని, బీజేపీ ఓ ప్రముఖ నాయకుడిని కోల్పోయిందని మాజీ ముఖ్యంత్రి బీఎస్. యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు.
ప్రముఖుల శ్రధ్దాంజలి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, డివి. సదానంద గౌడ, కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్, బీజేపీ ఎంపీ శోభాకరందాజ్లే, బాహుబాష నటి భారతి విష్ణవర్దన్, సినీ నిర్మాత కే. మంజు, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా, మాజీ మంత్రి సీటీ. రవి, బీజేపీ ఎంపీ. పీసీ. మోహన్, ఆప్ జయనగర అభ్యర్థి రవిక్రిష్ణా రెడ్డి తో సహ పార్టీలకు అతితంగా నాయకులు బీఎన్. విజయ్ కుమార్ కు శ్రధ్దాంజలి ఘటించారు.
కేంద్ర మంత్రుల కన్నీరు
బీఎన్. విజయ్ కుమార్ ఇంటి దగ్గరకు చేరుకుని ఆయన పార్దీవదేహం చూసిన వెంటనే కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, డివి. సదానందగౌడ, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ తదితరులు కన్నీరు పెట్టుకున్నారు. బెంగళూరులో బీజేపీ ఈ స్థాయికి రావడానికి గత 25 ఏళ్ల నుంచి విజయ్ కుమార్ శ్రమించారని, మంత్రి అవుతారని అనుకుంటున్న సమయంలో ఇలా అందర్నీ విడిచివెళ్లిపోయారని ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని విషాదం వ్యక్తం చేశారు.
ఎన్నిలు వాయిదా ?
జయనగర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మళ్లీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీఎన్. విజయ్ కుమార్ నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి సౌమ్య రెడ్డి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. విజయ్ కుమార్ ఇప్పటికే నామినేషన్ వేసి బరిలో ఉండటంతో ఆయన హఠాన్మరణంతో జయనగర నియోజక వర్గం ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.